తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని రేపిన హైదరాబాద్ జూబ్లిహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు పక్కా సాక్షాధారాలతో చార్జిషీట్ దాఖలు చేశారు. నాంపల్లి కోర్టు, జస్టిస్ జూవైనల్ బోర్డులో జూబ్లిహిల్స్ పోలీసులు వేరువేరుగా నిందితులపై చార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసులో ఏకంగా 65 మందిని సాక్షులుగా చేర్చారు. మైనర్ బాలురు తీవ్రమైన నేరం చేసినందున వారిని మేజర్లుగా పరిగణించి తగిన శిక్ష వేయాలని పోలీసులు చార్జిషీట్ లో పేర్కొన్నారు. నిందితులపై నేరం నిరూపణ అయ్యే విధంగా సాంకేతిక అధారాలను పకడ్బందీగా సిద్దం చేశారు.
ఘటనా స్థలంలో లభించిన నమూనాలు వివరాలు, ఫారెన్సిక్ అధికారుల ఇచ్చిన నివేదిక, సీసీ టీవీ పుటేజీకి సంబంధించిన వివరాలతో పాటు నేరం నిరూపణకు అవసరమైన కీలక సాక్షాధారాలను చార్జిషీటులో పొందుపరిచారు జూబ్లిహిల్స్ పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే అయిదుగురు మైనర్లు బెయిల్ పై విడుదల అవ్వగా, ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాత్రం చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అతను బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు.
కేసు విషయానికి వస్తే మే 28న మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరగ్గా..31వ తేదీన బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకుని బాలిక వాంగ్మూలం సేకరించిన పోలీసులు .. విడతల వారీగా ప్రధాన నిందితుడు సాదుద్దీన్ తో పాటు మరో అయిదుగురు మైనర్లను జూన్ 5న అరెస్టు చేసి చేశారు. ప్రధాన నిందితుడు సాదుద్దీన్ చంచల్ గుడ జైలుకు తరలించగా, మైనర్ నిందితులను జూవైనల్ హోమ్ కు తరలించారు. నిందితులు రాజకీయ పార్టీ నేతల కుటుంబాలకు చెందిన వారు కావడంతో ఇది రాజకీయ రంగు పులుముకుంది. దీంతో పోలీసులు ఈ కేసును సవాల్ గా తీసుకుని నిందితులు నేరం చేసినట్లుగా రుజువు చేసే అన్ని సాక్షాధారాలను సేకరించి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ఇందులో ఫొరెన్సిక్ నివేదిక కీలకంగా మారింది.