Jagga Reddy: ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల నుండి కరోనా బాధితులు ఇళ్లకు వెళ్లేందుకు అవసరమైన పలు సందర్భాలలో అంబులెన్స్ లు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితులను గమనించిన జగ్గారెడ్డి ఉచిత అంబులెన్స్ సర్వీసులను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.
తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఉస్మానియా, గాంధీ ఆసుపత్రి వద్ద రెండేసి చొప్పున అంబులెన్స్ లు ఏర్పాటు చేస్తున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు. మరో రెండు మూడు రోజుల్లో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు. పేదలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఈ అంబులెన్స్ లను ఉచితంగా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. తన తల్లిదండ్రుల పేరున ట్రస్ట్ ఏర్పాటు చేయాలన్న కోరిక తనకు ఉందనీ, ప్రస్తుత కరోనా సమయంలో అంబులెన్స్ ఏర్పాటు చేస్తే పేద ప్రజలకు ఎంతో మేలు చేసినట్లు అవుతుందని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వాన్ని తప్పుబట్టేందుకు కాకుండా పేదలకు సేవ చేయాలన్న తలంపుతోనే తాను అంబులెన్స్ లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
Read More: Sushant Singh Rajput case: సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో మరో వ్యక్తి అరెస్టు..!!
పీసీసీ సూచిస్తే ఇతర జిల్లాల్లోనూ అంబులెన్స్ సేవలను ఏర్పాటు చేస్తానని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. గాంధీ భవన్ లోని అంబులెన్స్ లకు రోగుల తాకిడి పెరిగిందన్నారు. జిల్లాలకు పంపాలంటూ ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల నుండి గ్రామాలకు వెళ్లేందుకు ఈ సదుపాయం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎంత ఖర్చు అయినా గ్రామాలకు అంబులెన్స్ లను గ్రామాలకు తీసుకువెళతామని తెలిపారు. పనిలో పనిగా తానూ పీసీసీ రేస్ లో ఉన్నానని పేర్కొన్నారు జగ్గారెడ్డి. తనకు అవకాశం కల్పించాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లను కోరారు. పీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతూనే తనకు అవకాశం కల్పిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేస్తానని అన్నారు.