Jagga Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరుపై సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో జరిగిన సీఎల్పీ సమావేశంలో జగ్గారెడ్డి పార్టీ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీనా …ప్రైవేటు లిమిటెడ్ కంపెనీనా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చర్చ లేకుండానే రెండు నెలల కార్యాచరణ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. జహీరాబాద్ లో క్రికెట్ మ్యాచ్ విషయం కనీసం గీతారెడ్డికి సమాచారం ఇవ్వరా, సంగారెడ్డి జిల్లాకు వస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నతనకే సమాచారం ఇవ్వారా అని నిలదీశారు. కనీస ప్రోటోకాల్ పాటించాలి కదా సమాచారం ఇవ్వకపోవడం అంటే రేవంత్ తో వివాదం ఉందని చెప్పాలని అనుకుంటున్నారా అంటూ ఫైర్ అయ్యారు జగ్గారెడ్డి.
అనంతరం మీడియా పాయింట్ వద్ద కూడా తన ఆవేదనను వ్యక్తం చేశారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరో హీరో కాలేరనీ, రేవంత్ పీసీసీ కాకముందే తాను మూడు సార్లు ఎమ్మెల్యేనని గుర్తు చేశారు జగ్గారెడ్డి. రాజకీయాల్లో హీరోయిజం పని చేయదని వ్యాఖ్యానించారు. పార్టీ లో జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తే సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి వత్తిడి మేరకు ఇలా ప్రవర్తించారో చెప్పాలని అన్నారు. పార్టీ మారాలంటే అడ్డు చెప్పేవారు ఎవరు తనకు లేరు కానీ నైతిక విలువలకు కట్టుబడి తాను కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ల నాయకత్వంలో పని చేస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే గ్రామస్థాయిలో వెళ్లి పని చేయాలన్నారు. రాష్ట్రంలో తనకు అభిమానులు ఉన్నారనీ, కావాలంటే పార్టీ సపోర్టు లేకుండా రెండు లక్షల మందితో సభ పెట్టి చూపిస్తానంటూ సవాల్ చేశారు జగ్గారెడ్డి. పార్టీలో నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలకు సరైన గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితిలో మీడియా ముందుకు వచ్చి తన ఆవేదన వ్యక్తం చేస్తున్నానన్నారు. ప్రస్తుతం జగ్గారెడ్డి వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి.