Journalist Raghu Case: సూర్యపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంపోడు తండా దాడి ఘటనకు సంబంధించిన కేసులో జర్నలిస్ట్ రఘును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే పోలీసులు రఘును అరెస్టు చేసిన తీరును వివిధ రాజకీయ పక్షాలు తప్పుబట్టాయి. ఇంటి నుండి బైక్ పై బయటకు వెళ్లిన జర్నలిస్ట్ రఘు ఓ తోపుడు బండి వద్ద మామిడి కాయలు కొనుగోలు చేస్తుండగా మఫీలో వచ్చిన పోలీసులు మల్కాజిగిరిలో బలవంతంగా కారులో ఎక్కించుకుని తరలించారు. దానికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఈ వీడియోను ట్వీట్ చేస్తూ “ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా? అని తెలంగాణ డీజీపీని ప్రశ్నించారు. దీన్ని కిడ్నాప్ అంటారా? లేక అరెస్టు అంటారా? వీళ్లు పోలీసులా? లేక గులాబీ గుండాలా? ఇదేం రాజ్యం? ఒక జర్నలిస్ట్ పై ఇంత దారుణం ఎందుకు? నోటీసు ఇచ్చి అరెస్టు చేయవచ్చు కదా? నిరంతరం ఫ్రెండ్లీ పోలీసు గూర్చి తపించే తెలంగాణ డీజీపీ గారు ఈ పోలీసులపై మీరు ఏం చర్యలు తీసుకుంటారు” అని ప్రశ్నించారు.
ప్రభుత్వ లోపాలను ఎండగడితే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తారా అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గుర్రంపోడు తండాలోని గిరిజన భూముల కబ్జా బాగోతాన్ని మీడియాలో కవర్ చేసినందుకు జర్నలిస్ట్ రఘుపై కేసు పెట్టారని తెలిసిందని బండి సంజయ్ పేర్కొన్నారు.
జర్నలిస్ట్ వినోద్ దువా పై నమోదు అయిన దేశద్రోహం కేసును సుప్రీం కోర్టు కొట్టేసిన రోజునే ఇక్కడ తెలంగాణలో జర్నలిస్ట్ రఘును పోలీసులు అనైతికంగా అదుపులోకి తీసుకోవడం గమనార్హం. ఈ నెల 3వ తేదీన రఘును పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై రఘు సతీమణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో పోలీసులు అరెస్టు చూపి హూజూర్నగర్ కోర్టులో జడ్జి ముందు హజరుపర్చగా 14 రోజులు రిమాండ్ విధించడంతో హుజూర్ నగర్ సబ్ జైలుకు తరలించారు.
అసలు విషయం ఏమిటంటే .. హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం గుర్రంబోడు తండా 540 సర్వే నెంబర్ ఫిబ్రవరి 7న బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన భరోసా యాత్ర తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఆనాడు పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య రాళ్ల దాడి జరిగింది. పలువురు పోలీసులతో పాటు బీజేపీ నేతలు గాయపడ్డారు. నాటి ఘటనకు సంబంధించి బీజేపీ నేతలతో పాటు పలువురు స్థానికులపైనా కేసు నమోదు చేశారు. మొత్తం 21 మంది నిందితుల్లో ఏ 19 గా జర్నలిస్ట్ రఘు, ఏ 20గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజెపి ఏమ్మెల్యే రఘునందన్ రావు ఏ 21 గా ఉన్నారు. అయితే ఈ కేసులో 1 నుండి 6వరకూ ఉన్న నిందితులను అరెస్టు చేసి ఆ తరువాత బెయిల్ పై విడుదల చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ రఘును పోలీసులు విచారణ కూడా పిలవలేదు.
నాడు కొందరిని మాత్రమే అరెస్టు చేసిన పోలీసులు ఇప్పుడు నాలుగు నెలల తరువాత రఘును అరెస్టు చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ కేసులో రఘు బెయిల్ ప్రయత్నాలు చేస్తుండగా పోలీసులు మరో కేసు నమోదు చేశారు. జనవరి నెలలో ఎమ్మెల్యే ను దూషించాడని వచ్చిన ఫిర్యాదుపై రఘుపై కేసు నమోదు చేసిన మఠంపల్లి పోలీసులు పీటీ వారెంట్ కూడా తెచ్చుకున్నారని జర్నలిస్ట్ సంఘాలు మండిపడుతున్నాయి. తెలంగాణలో సంచలనంగా మారిన జర్నలిస్ట్ రఘు అరెస్టు వ్యవహారం, కేసుల నమోదు తీవ్ర చర్చనీయంశమవుతోంది.
దీన్ని కిడ్నాప్ అంటారా లేక అరెస్ట్ అంటారా?
వీళ్లు పోలీసులా లేక గులాబీ గూండాలా?
ఇదేం రాజ్యం?ఒక జర్నలిస్ట్ పై ఇంత దారుణం ఎందుకు?
నోటీసు ఇచ్చి అరెస్ట్ చేయవచ్చు కదా?
నిరంతరం ఫ్రెండ్లీ పోలీసు గూర్చి తపించే @TelanganaDGP గారు, ఈ పోలీసులపై మీరు ఏంచర్య తీసుకుంటారు? @INCTelangana pic.twitter.com/ZZ60IXZCkR— Dr Sravan Kumar Dasoju (@sravandasoju) June 8, 2021