Journalist Raghu Case: ఇటీవల హైదరాబాద్ లో జర్నలిస్ట్ రఘును పోలీసులు కిడ్నాప్ తరహాలో అరెస్టు చేసి తరలించడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సబ్ జైలు రిమాండ్ లో ఉండగానే పోలీసులు రఘుపై మరో కేసు నమోదు చేశారు. జర్నలిస్ట్ రఘు అరెస్టు పై ఇప్పటికే పలు రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి.
తాజాగా పలువురు ప్రముఖులు, జర్నలిస్ట్ సంఘాల నేతలు నేడు డీజీపీకి లేఖ రాశారు. తక్షణం రఘును విడుదల చేయాలని వారు కోరారు. మాజీ ఎంపి కొండా విశ్వేశ్వరరెడ్డితో సహా ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్, సామాజిక ఉద్యమకారుడు, విద్యావేత్త చుక్కా రామయ్య, మాజీ సంపాదకుడు కె రామచంద్రమూర్తి, తెలంగాణ జేఏసీ చైర్మన్, టీజెఎస్ ప్రసిడెంట్ ప్రొఫెసర్ కోదండరాం తదితరులు డీజీపీ ఎం మహేందర్ రెడ్డికి లేఖ రాశారు. ఈ లేఖలో పలు ముఖ్య విషయాలను ప్రస్తావించారు.
సూర్యపేట జిల్లా గుర్రంబోడులో భూములకు సంబంధించి జరుగుతున్న ఆందోళనను కవర్ చేసినందుకే నాడు రాజ్ న్యూస్ ఛానల్ తరపున పని చేసిన జర్నలిస్ట్ రఘుపై అక్రమంగా కేసు బనాయించి అరెస్టు చేశారని పేర్కొన్నారు. నాడు రాజ్ న్యూస్ లో పని చేసిన రఘు నేడు తొలి వెలుగు లో పని చేస్తున్నాడని, సమాజంలో జరుగుతున్న ఘటనలను కవరేజ్ చేయడమే జర్నలిస్ట్ ల విధి అని అన్నారు. కవరేజ్ చేయడానికి వెళ్లినందుకు ఆ ఘటనకు కారణమని చూపుతూ కేసు పెట్టడం సరికాదని పేర్కొన్నారు.
రఘు అరెస్టు కూడా చట్ట విరుద్ధంగా జరిగిందన్నారు. జూన్ మూడవ తేదీన తన ఇంటి సమీపంలో మార్కెట్ లో ఉన్న ఉన్న జర్నలిస్ట్ రఘును నెంబర్ ప్లేటు లేని వాహనంలో వచ్చి అపహరించారనీ, తరువాత రఘును అరెస్టు చేశామని పోలీసులు ప్రకటించారన్నారు.