తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన హైదరాబాద్ జూబ్లిహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పబ్ లో పార్టీకి వచ్చిన ఓ మైనర్ బాలికను కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లి అయిదుగురు మైనర్ బాలురు, ఒక మేజర్ సామూహిక అత్యాచారం పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రాజకీయ నేతల పిల్లలు నిందితులుగా ఉండటంతో తీవ్ర సంచలనం అయ్యింది. ఈ కేసులో అందరు నిందితులను అరెస్టు చేయడం, మైనర్ బాలురలను జూవైనల్ హోమ్ కు, మేజర్ ను జైలుకు తరలించిన పోలీసులు..పక్కా సాక్షాధారులతో చార్జిషీటు దాఖలు చేశారు. నాంపల్లి కోర్టు, జువైనల్ జస్టిస్ బోర్డులో వేరువేరుగా చార్జి షీటు దాఖలు చేసి ఏకంగా 65 మందిని సాక్షులుగా చేర్చారు. అయితే తీవ్రమైన నేరానికి పాల్పడి నందున మైనర్ లను మేజర్ లుగా పరిగణించి విచారణ చేపట్టాలని జువైనల్ జస్టిస్ బోర్డును జూబ్లిహిల్స్ పోలీసులు కోరారు. ఈ మేరకు చార్జిషీటులో వివరాలు పేర్కొన్నారు.
మరో పక్క హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశారు. అత్యాచారానికి పాల్పడిన అయిదుగురి మైనర్ ల మెచ్యురిటీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నందున వారిని మేజర్ లుగా పరిగణించాలని పిటిషన్ లో కోరారు. హైకోర్టులో పిటిషన్ విచారణ దశలో ఉండగానే అయిదుగురిలో నలుగురు నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ జూవైనల్ జస్టిస్ బోర్డు తీర్పు ఇచ్చింది. జూవైనల్ సెక్షన్ 15 ప్రకారం బోర్డు నలుగురిని మేజర్లుగా పరిగణించాలనే అంచనాకు వచ్చింది. నలుగురు నిందితులు తీవ్ర నేరానికి పాల్పడినట్లుగా కోర్టు భావించింది. మానసిక నిపుణులతో పాటు బోర్డు సభ్యులు సమీక్షించి నివేదికను వెల్లడించారు. దీంతో నలుగురు మైనర్లను మేజర్లుగా పరిగణిస్తూ జూవైనల్ జస్టిస్ బోర్డు తీర్పు ఇచ్చింది. అయితే ఈ కేసులో అయిదవ మైనర్ పై మాత్రం అభియోగాలు తీవ్రంగా లేనందున బోర్డు అతన్ని మైనర్ గానే పరిగణించింది. దీంతో ఈ కేసు విచారణ జూవైనల్ జస్టిస్ బోర్డు పరిధి నుండి నాంపల్లి కోర్టుకు మారనుంది. నలుగురు మైనర్లను మేజర్లుగా పరిగణిస్తూ విచారణ చేపట్టనున్నారు.
జూబ్లిహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో పక్కా సాక్షాధారాలతో చార్జిషీటు దాఖలు చేసిన పోలీసులు