తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అయిదుగురు దుర్మరణం చెందారు. మరో పక్క కర్ణాటక రాష్ట్రం రాయచూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హైదరాబాద్ వాసులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..హైదరాబాద్ నుండి గుజరాత్ వైపు ఓ కంటైనర్ వెళుతుండగా కామారెడ్డి జిల్లా మద్నురు మండలం మేనూర్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఎదురుగా వచ్చిన ఆటో అదుపుతప్పి కంటైనర్ లారీ కిందకు దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంతో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, ఆటోలో ప్రయాణిస్తున్న అయిదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కంటైనర్ లారీ డ్రైవర్, క్లీనర్ లకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఆటో రాంగ్ రూట్ లో వచ్చి కంటైనర్ లారీని ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మరో పక్క కర్ణాటక రాష్ట్రం రాయచూర్ వద్ద కారును లారీ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు హైదరాబాద్ వాసులు మృతి చెందారు. హైదరాబాద్ కు చెందిన ప్రదీవ్ (35), పూర్ణిమ (30), జితిన్ (12), మహీన్ (7) కారులో గోవాకు వెళ్లి హైదరాబాద్ తిరిగి వస్తుండగా రాయచూర్ జిల్లా సింధనూర్ వద్ద బాలాజీ క్యాంపు సమీపంలో కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ప్రయాణిస్తున్న భార్య, భర్త, ఇద్దరు పిల్లలు అక్కడే కక్కడే మృత్యువాత పడ్డారు. సమాచారం తెలుసుకున్న బలగనూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుల బంధువులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుండి పరారైయ్యాడు. బలగనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.