ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు సీబీఐ అధికారులు 160 సీఆర్పీసీ కింద నిన్న నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో గానీ ఢిల్లీలో గానీ ఈ నెల 6వ తేదీన వివరణ ఇవ్వాలని సీబీఐ అధికారులు నోటీసులో కోరారు. దీనిపై ముందుగా స్పందించిన కవిత హైదరాబాద్ లో తన నివాసంలో సమాధానాలు ఇస్తానని తెలిపారు.
అయితే ఈ రోజు న్యాయనిపుణులు, తన తండ్రి సీఎం కేసిఆర్ తో భేటీ అయిన తర్వాత తన నిర్ణయాన్ని కవిత మార్చుకున్నారు. సీబీఐ అధికారి అలోక్ కుమార్ కు లేఖ రాశారు. లిక్కర్ స్కామ్ నకు సంబంధించి ఎఫ్ఐఆర్ తో పాటు ఫిర్యాదు కాపీ ఇవ్వాలని కోరారు. అలానే సంబంధిత అనుబంధ కాపీలను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వీటిని అందజేస్తే వేగంగా వివరణ ఇచ్చేందుకు వీలు అవుతుందని కవిత పేర్కొన్నారు. తాను కోరిన మేరకు డాక్యుమెంట్లు అందజేస్తే ఆ పై విచారణ తేదీ ఖరారు చేయవచ్చని తెలిపారు. కవిత లేఖపై సీబీఐ అధికారులు ఏ విధమైన రిప్లై ఇస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సీబీఐ నోటీసుల నేపథ్యంలో తండ్రి కేసిఆర్ ను కలిసిన తనయ కవిత