KCR: ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన నేతలు నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారికి సేవలు అందిస్తుంటే అటు ప్రజల్లోనూ, అటు పార్టీలోనూ మంచి పరపతి ఉంటుంది. అలా కష్టపడే నేతలను పార్టీ అధినేతలు ఇష్టపడుతుంటారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) లో అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ పలువురు ఎమ్మెల్యేల పనితీరుపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసిఆర్ ముగ్దుడవుతున్నారుట. టీఆర్ఎస్ కు చెందిన యువ ఎమ్మెల్యేలు అభివృద్ధిలో దూసుకుపోతున్నారుట. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వారు ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మరో మారు నియోజకవర్గంలో టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో ఆ యువ ఎమ్మెల్యేలు పార్టీ పనులతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో వీరు ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన యువ నేతలు పట్నం నరేందర్ రెడ్డి (కొడంగల్), పైలెట్ రోహిత్ రెడ్డి (తాండూర్), డాక్టర్ ఆనంద్ (వికారాబాద్), కొప్పుల మహేష్ రెడ్డి (పగిరి) లు మొదటి సారి 2018 ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేలు అయ్యారు. వీరు నిత్యం నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తూ వస్తున్నారు.
KCR: ప్రజల మధ్యే ఉంటూ
కొడంగల్ లో రేవంత్ రెడ్డిని ఓడించి నరేందర్ రెడ్డి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నియోజకవర్గంలో పార్టీ పట్టు సడలకుండా ఉండేందుకు కష్టపడుతున్నారు. సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపునకు ఇప్పటి నుండి ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నారు. అదే విధంగా పగిరి నియోజకవర్గంలో కొప్పుల మహేశ్ రెడ్డి కూడా హంగు అర్బాటులు లేకుండా నిత్యం ప్రజల మధ్య తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇక వికరాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ ప్రతి రోజు క్యాంపు కార్యాలయంలో స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నిత్యం నియోజకవర్గంలో ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గ్రామాల్లో, పట్టణాల్లో పాదయాత్రలు నిర్వహిస్తూ ప్రజలకు మరింత చేరువ అవుతున్నారు. ఈ యువ ఎమ్మెల్యేల పని తీరును టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ ప్రశంసిస్తున్నారుట.