KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఒక్కోసారి ఆయన రాజకీయ ప్రత్యర్థులు సంచలన విమర్శలు చేసే సంగతి తెలిసిందే. ఆయా సందర్భాలకు తగినట్లుగా నేతలు గులాబీ దళపతిపై విరుచుకుపడుతుంటారు. అలా తాజాగా కరోనా సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను బీజేపీ టార్గెట్ చేసింది. సోషల్ మీడియా వేదికగా మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ను బీజేపీ నేత విజయశాంతి టార్గెట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె సంచలన ఆరోపణలు చేశారు.
200 కోట్లు లాస్…
కరోనా విషయంలో రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని సీఎం కేసీఆర్ గాలికి వదిలేశారని విజయశాంతి ఆరోపించారు. ప్రైవేటు హాస్పిటళ్లలో కోవిడ్ చికిత్స ఫీజులపై నియంత్రణ లేదని దుయ్యబట్టారు… పీజులు కట్టలేక ప్రజలు అల్లాడుతుంటే గడీలో ఉన్న దొరకు కరోనా బాధితుల హాహాకారాలు వినిపించడంలేదని మండిపడ్డారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు చేసి ఉంటే కరోనా చికిత్సలో రూ.5 లక్షల వరకు కేంద్రమే చెల్లించి ఉండేదని విజయశాంతి పేర్కొన్నారు. ఈ స్కీంలో చేరనందుకు రాష్ట్రం రూ.200 కోట్లు కోల్పోయిందన్నారు. తన బంధువులు, అనుచరుల హాస్పిటళ్లకు రోజూ కోట్లలో వస్తున్న ఆదాయాన్ని కాపాడేందుకే.. దీనిపై కేసీఆర్ నిర్ణయం తీసుకోలదంటూ సంచలన ఆరోపణలు చేశారు.
వాళ్ల కోసం దీక్ష
ఆయుష్మాన్ భారత్ను, ఆరోగ్యశ్రీని ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయట్లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని విజయశాంతి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ను అమలు చేయనందుకు నిరసనగా… ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చాలన్న డిమాండ్తో జరగబోతున్న “గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష”ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ నేత చేసిన సంచలన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో మరి!