KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ చాణక్యుడు అనే సంగతి తెలిసిందే. ఆయనకు ఇప్పుడు సొంత పార్టీ నేతలే షాకులు ఇస్తున్నారని అంటున్నారు. అందులో ఓ ఎంపీ , ఓ ఎమ్మెల్యే కేసీఆర్కు ఊహించని ట్విస్టులు ఇస్తున్నారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడైన డీఎస్తో ఆ పార్టీ సీనియర్ నేత ఈటల రాజేందర్ భేటీ కావటం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయ అంశమైంది. ఈ ఇద్దరు నేతలు టీఆర్ఎస్ పార్టీ రథసారథికి గిట్టని వారనే సంగతి తెలిసిందే.
ఈటల ఎపిసోడ్ లో ఎన్నో ట్విస్టులు
భూకబ్జా ఆరోపణలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటలను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే టీఆర్ఎస్ పార్టీ నేతగానే ఉన్న ఈటల తన భవిష్యత్ రాజకీయ వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. తన హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలతో చర్చించి.. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయటంపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని ఈటల వెల్లడిస్తున్నారు. మరోవైపు రాజకీయంగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్య నేతలతో సమావేశం అవుతున్నారు.
కేసీఆర్ కు నచ్చని నేతతో…
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడైన డీఎస్తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. నిజామాబాద్కు ప్రత్యేకంగా వెళ్లిన ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ఎంపీ డీఎస్ తో భేటీ అయ్యారు. డీఎస్ నివాసంలో ఈ భేటీ సుమారు రెండు గంటలపాటు జరిగింది. ఈ సందర్భంగా ఈ భేటీలో తండ్రి డీఎస్తో పాటు బీజేపీ ఎంపీ అరవింద్ కూడా పాల్గొనటం మరింత ఆసక్తికరం. టీఆర్ఎస్ పార్టీ ఎంపీగానే కొనసాగుతూ తనపై విమర్శలు చేస్తున్న డీఎస్ విషయం తెలంగాణ సీఎం కేసీఆర్ కొరకరాని కొయ్యగా మారిన తరుణంలో ఆయనతో ఈటల భేటీ అవడంపై టీఆర్ఎస్ రథసారథి ఏ విధంగా స్పందిస్తారో మరి.