ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరించే వైఖరి ఏ విధంగా ఉంటుందనేది సందర్భానుసారం బట్టి ఉంటుందనే టాక్ ఉంది. కొన్ని సందర్భాల్లో ఆయన్ను టార్గెట్ చేస్తుంటారు. మరికొన్ని సందర్భాల్లో ప్రశంసిస్తుంటారు. అయితే, తాజాగా మళ్లీ కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ టార్గెట్ చేశారని చెప్తున్నారు. వరుసగా రెండు రోజుల పాటు ఏకంగా ఇరకాటంలో పెట్టేశారు.
వరుసగా రెండు రోజులు…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టులకు రానున్న కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా లేఖ రాశారు. రానున్న బడ్జెట్లో హైదరాబాద్- వరంగల్ మరియు హైదరాబాద్- నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్ తో పాటు హైదరాబాద్ ఫార్మా సిటీ కి రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాశారు. ప్రతిపాదిత రెండు ఇండస్ట్రియల్ కారిడార్ లకు సుమారు 5 వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని పియూష్ గోయల్ కు రాసిన లేఖలో మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఈ రెండు ఇండస్ట్రియల్ కారిడార్లను ముందుకు తీసుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నదని అయితే ఇందులో కనీసం 50 శాతం నిధులను రానున్న బడ్జెట్లో కేటాయించాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోనే అతి పెద్ద సింగిల్ ఫార్మా క్లస్టర్ అయిన హైదరాబాద్ ఫార్మా సిటీని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తుందని ఇప్పటికే ఆ దిశగా కార్యచరణ మొదలైందని కేంద్రమంత్రి రాసిన లేఖలో మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మేకిన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ ఆలోచనలను ఫార్మా సిటీ తో తెలంగాణ మరింత ముందుకు తీసుకుపోతుందన్న నమ్మకాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు.
కేటీఆర్ ఇంకో లేఖ ..
ఇది జరిగిన మరుసటి రోజే మంత్రి కేటీఆర్ ఇంకో లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలోని హ్యాండ్లూమ్ మరియు టెక్స్టైల్ పరిశ్రమ అభివృద్ధి కోసం నిధులతో పాటు పలు అంశాల్లో కేంద్ర ప్రభుత్వ మద్దతు కోరుతూ పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు, కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఒక లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు తోపాటు, సిరిసిల్లలో మెగాపవర్ క్లస్టర్ మంజూరు మరియు చేనేత మరియు జౌళి పరిశ్రమ అభివృద్ధి కోసం పలు అంశాలు తీసుకోవాల్సిన చర్యల పైన మంత్రి కేటీఆర్ ఈ లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలుకి రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రిని కోరారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ని సుమారు 1552 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిందని, ఇందులో సుమారు 1100 కోట్ల రూపాయలు మౌలిక వసతుల కల్పనకు అవసరమవుతాయని, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మెగా టెక్స్టైల్ పార్క్ పథకం ద్వారా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కి మద్దతు అందించాలని కోరారు. ఈ పథకం ద్వారా సుమారు 500 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందించే అవకాశం ఉందని, ఇందులో కనీసం 300 కోట్ల రూపాయలను వెంటనే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ మౌలికవసతుల సదుపాయాల కల్పన కోసం మంజూరు చేయాలని కోరారు.
రెండు లేఖల లెక్క ఏంటి?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ వరుసగా రెండు రోజులు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం బీజేపీని టార్గెట్ చేయడంలో భాగమని అంటున్నారు. కేంద్రం రాష్ట్రానికి ఏం చేయాల్సిందో ఉద్దేశిస్తూ ఈ లేఖ రాశారని , ఒకవేళ ఈ పనులు చేయడంలో విఫలమైతే కేంద్రాన్ని రాబోయే కాలంలో టార్గెట్ చేయడం సులభమని అంటున్నారు.