KCR: తెలంగాణ ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను సొంత పార్టీ నేతలే ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితి. ఓ వైపు సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జాల ఉదంతం టీఆర్ఎస్ పార్టీపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించేందుకు అవకాశం ఇవ్వగా తాజాగా అదే రీతిలో కరోనా సమయంలో కొందరు ఎమ్మెల్యేల వైఖరి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్డౌన్ విధించగా అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే మాత్రం రూల్స్ మాకు వర్తించవంటూ బ్రేక్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎమ్మెల్యే నేరుగా..
లాక్డౌన్ దృష్ట్యా ఎటువంటి ఫంక్షన్లు చేయొద్దని పోలీసులు ఆర్డర్స్ జారీ చేశారు. ఒక వేళ ఏవైనా ఫంక్షన్లు తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తే పరిమిత సంఖ్యలో మాత్రమే పాల్గొనాలని నిబంధనలు ఉన్నాయి. కానీ వాటన్నింటిని పట్టించుకోకుండా. అధికార పార్టీ ఎమ్మెల్యే లాక్డౌన్ మొదటిరోజునే వేడుకలలో పాల్గొనడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇలా వార్తల్లో నిలిచింది కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవనేని కృష్ణారావు. బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటుచేసిన వేడుకలలో ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకలలో ఆయనతో పాటు 100 మందికి పైగా కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
కేసీఆర్ ఇమేజ్ డ్యామేజ్ చేసేలా…
రాష్ట్రంలో కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో పలు లోపాలు ఉన్నాయంటూ ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు వివిధ అంశాలను ప్రస్తావిస్తున్నాయి. ఈ సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే నేరుగా వేడుకల్లో పాల్గొనడం సహజంగానే అధికార పార్టీని విపక్షాలు టార్గెట్ చేసే చాన్స్ ఇవ్వడం అవుతుందని పలువురు అంటున్నారు.