KCR: తెలంగాణ ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తనదైన శైలిలో ప్రత్యేకంగా రాజకీయం నెరిపే సంగతి తెలిసిందే. తాజాగా ఆయన తీసుకున్న రెండు నిర్ణయాలు హాట్ టాపిక్ అయ్యాయి. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3982 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో రాష్ట్రంలో ఇప్పటిదాకా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 5,36,766కి చేరింది. ఈ సమయంలోనే గత కొద్దికాలంగా విపక్షాలు డిమాండ్ చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి రాష్ట్రం చేరాలనే ప్రతిపాదనకు ఓకే చెప్పేశారు. దీంతో పాటుగా మరో నిర్ణయం తీసుకున్నారు.
ఆయుష్మాన్ భారత్ తో మొదలు…
కరోనా మహమ్మారి సమయంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయడానికి ఉన్న ఇబ్బందులు ఏంటి? అంటూ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్ను బీజేపీ నేతలు నిలదీశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, నేషనల్ హెల్త్ అథారిటీతో ఎంవోయూ కుదుర్చుకుంది.. తదనుగుణంగా ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖారారు చేసింది. ఆయుష్మాన్ భారత్ అమలు నిర్ణయం వెలువడిన మరుసటిరోజే సీఎం కేసీఆర్ ఇంకో అడుగు వేశారు.
గాంధీలో ధైర్యం..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారిగా సీఎం హోదాలో గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. ఆయన స్వయంగా గాంధీ ఆస్పత్రిలోని పరిస్థితిని పరిశీలించారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్న కోవిడ్ బాధితులు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గాంధీ ఆసుపత్రిలోని కరోనా ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించారు. వారిని దైర్యంగా ఉండాలని సూచించారు. కరోనా నివారణకి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇలాంటి విపత్కరమైన సమయంలో కరోనా రోగులకి చికిత్స అందిస్తున్న వైద్యులకి, వైద్య సిబ్బందిని సీఎం కేసీఆర్ అభినందించారు. ఈ నిర్ణయం సహజంగానే రోగుల్లో ధైర్యం నింపడానికి ఉపయుక్తంగా ఉంటుందనే సంగతి తెలిసిందే.