KCR: తెలంగాణలో గత కొద్ది రోజులుగా రాజకీయ వాతావరణం వేడేక్కింది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ బీజేపీకి వ్యతిరేకంగా చాలా అడుగులు ముందుకు వేశారు. ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు పలు పర్యాయాలు మీడియా సమావేశాలను నిర్వహించి బీజేపీని టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆరోపణలు చేశారు. జాతీయ స్థాయి రాజకీయాల్లో క్రియాశీల భూమికను పోషించేందుకు ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, స్టాలిన్, ఉద్దవ్ ఠాకరే, ఎన్సీపీ నేత శరద్ పవార్ తదితరులను కలిశారు, చర్చించారు. పలు ప్రాంతీయ పార్టీలతో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టే ప్రయత్నాలు ప్రారంభించారు.
KCR: చంద్రబాబును మించిన చాణిక్యుడు
అయితే ఇప్పుడు తెలంగాణలోనే కేసిఆర్ కు కష్టాలు వచ్చే పరిస్థితి కనబడుతోంది. వచ్చే ఏడాది జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందో..? రాదో అన్న అనుమానాలు ప్రారంభమైయ్యాయి. ఎందుకంటే.. రెండు సార్లు వరుసగా అధికారంలో ఉండటంతో సాధారణంగానే ప్రభుత్వంపై ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకతను పొగొట్టుకునేందుకే కేసిఆర్ ఇటీవల 90వేలకు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. లోకల్ సర్వేలు చూస్తున్నా మరల టీఆర్ఎస్ అధికారంలోకి రావడం కష్టమేననీ, 40 నుండి 45 సీట్ల కంటే ఎక్కువ రావు అని ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ చూస్తూ చూస్తూ కేసిఆర్ ఊరుకోరు కదా. తెలుగు రాష్ట్రాల్లో మంచి మాటకారి, మంచి తెలివితేటలు ఉన్న నాయకుడు కేసిఆర్, వాస్తవానికి చంద్రబాబు నాయుడునే చాణిక్యుడు అని అంటారు. చంద్రబాబును మించిన చాణిక్యుడు కేసిఆర్. రాజకీయ వ్యూహాలు వేయడంలో దిట్టగా కేసిఆర్ కు పేరుంది.
KCR: అప్ కు దేశ వ్యాప్త క్రేజ్
ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలో ఫామ్ లో ఉంది. ఢిల్లీలో అధికారాన్ని కొనసాగిస్తూనే పంజాబ్ లోనూ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. పంజాబ్ లో గెలుపుతో అప్ కు దేశ వ్యాప్తంగా ఒక క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా విద్యావంతులు, అర్బన్ ప్రాంతాల్లో తటస్థులు ఆప్ పట్ల ఆకర్షితులు అవుతున్నారు. సో.. అందుకే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఆప్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని అనుకుంటున్నారు. హైదరాబాద్ ప్రాంతంలోని 10 – 12 నియోజకవర్గాల్లో యూత్ ఓటర్లు ఆప్ పట్ల ఆకర్షితులు అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2009 ఎన్నికల్లోనూ హైదరాబాద్ ప్రాంతంలోని కొన్ని నియోజకవర్గాల్లో లోక్ సత్తా పార్టీకి మంచి ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లు చీల్చే అవకాశం ఉంటుంది.
పొత్తు కోసం ఆరాటం
అందుకే ఆప్ పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచన కేసిఆర్ చేయనున్నారని వార్తలు వినబడుతున్నాయి. ఇంతకు ముందే కేసిఆర్ రెండు పర్యాయాలు అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అయ్యాయి. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టే క్రమంలో కేజ్రీవాల్ తో కేసిఆర్ కలిశారు. ఇప్పటికే తెలంగాణలో పొత్తు అంశంపై కేసిఆర్ కేజ్రీవాల్ కు ప్రతిపాదన పంపినట్లు వార్తలు వినబడుతున్నాయి. ఏపి నుండి కొన్ని పార్టీలు ఆప్ తో పొత్తుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఏపి కంటే కూడా ఆప్ కి తెలంగాణలోనే ఓట్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే టీఆర్ఎస్ టీమ్ ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. కేజ్రీవాల్ తో కేసిఆర్ కు ఉన్న పరిచయాల కారణంగా పొత్తు సాధ్యపడుతుందేమో చూడాలి మరి.