KCR : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఖుషీ అయ్యేలా ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి వార్త అందించారు. బుధవారం శాసనసభ వేదికగా ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. రెండు, మూడు రోజుల్లోనే ఉద్యోగులకు గౌరవప్రదమైన పీఆర్సీ ప్రకటిస్తామని కేసిఆర్ పేర్కొన్నారు. ఉద్యోగులపై తమకు ఎంత ప్రేమ ఉందో గత పీఆర్సీతోనే చూపించామని గుర్తు చేశారు. ఇండియాలోనే తాము అత్యధిక జీతాలు పొందుతున్నామని తెలంగాణ ఉద్యోగులు కాలర్ ఎత్తుకొని చెప్పుకునే విధంగా చేస్తామని గతంలో చెప్పారమనీ, దాన్ని అమలు చేస్తున్నామని కేసిఆర్ అన్నారు. పిఆర్సీ ప్రకటించిన తరువాత తప్పకుండా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం కేసిఆర్ పలు హామీలను ఇచ్చారు.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం కేసిఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో రైతులకు రుణ మాఫీ నూరు శాతం చేసి తీరతామని కేసిఆర్ స్పష్టం చేశారు. 25వేల వరకు ఎంత మందికి రుణాలు ఉన్నాయో వాటిని గత ఏడాది మాపీ చేశామనీ, మిగతా వారి విషయంలో రేపు ఆర్థిక మంత్రి ప్రకటన చేస్తారని కేసిఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా రుణ మాఫీ చేయడం లేదని కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి అన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడికి వైద్య ఆరోగ్య శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని కేసిఆర్ వివరించారు. రాష్ట్రంలోని పలు గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు కరోనా బారిన పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందనీ, దీనిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు. నూతన సచివాలయ నిర్మాణంలో భాగంగా తొలగించాల్సి వచ్చిన ఆలయాలను పునః నిర్మిస్తామని కేసిఆర్ హామీ ఇచ్చారు.