KCR: తెలంగాణలో ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇలాకా అయిన హుజురాబాద్ లో గెలుపు కోసం ఇటు టీఆర్ఎస్ అటు బీజేపీ ప్రతిష్టాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే, ఈ ఎన్నిక గురించి ప్రత్యేక వ్యూహాలు పన్నుతున్నారు. అయితే, తాజాగా ఓ గుడ్ న్యూస్ , ఓ బ్యాడ్ నయూస్ ఆయన వినాల్సి వచ్చింది.
Read More : KCR: కేసీఆర్ పై ప్రశంసలు కురిపించిన కాంగ్రెస్ పెద్దాయన
గుడ్ న్యూస్ ఏంటంటే…
హుజూరాబాద్ ఉప ఎన్నికలో తమ సంఘం తరఫున ఎవరూ పోటీ చేయట్లేదని తెలంగాణ ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడీల కుమార్గౌడ్ స్పష్టం చేశారు. ఉప ఎన్నికలో పోటీ చేస్తామని ప్రకటించిన వాసుదేవరెడ్డికి తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. సొంత ప్రయోజనాల కోసం కొందరు అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. హన్మకొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా తమ హక్కులు, సమస్యల పరిష్కారం కోసం మాత్రమే పోరాటం చేస్తాం తప్ప రాజకీయం చేయట్లేదని ఆయన అన్నారు. గత రెండు, మూడేళ్లుగా తమ సమస్యలను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, కేటీఆర్, హరీశ్రావుతోపాటు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో సీఎం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్న క్రమంలో కొందరు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
Read more : KCR: కేసీఆర్కు షాక్.. హుజురాబాద్లో మారిపోతున్న సీన్…
ఇదే బ్యాడ్ న్యూస్…
మరోవైపు…తమ సమస్యలపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని మిడ్ మానేరు నిర్వాసితులు తెలిపారు. ముంపు గ్రామాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. సిరిసిల్ల జిల్లా మిడ్ మానేరు ఐక్య వేదిక ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ తీరుపై నిరసనగా వేములవాడ నంది కమాన్ వద్ద నల్ల బ్యాడ్జీలు, నల్ల బెలూన్స్తో ధర్నా చేపట్టారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం తాము సర్వస్వం త్యాగం చేశామన్నారు. ఇప్పుడు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పూర్తయినా.. నిర్వాసితుల సమస్యలు మాత్రం పెండింగ్లో ఉన్నాయని విమర్శించారు. తమ సమస్యలను పరిష్కారం చేయాలని రెండేళ్ల క్రితం కలెక్టర్ కార్యాలయం వరకు మహా పాదయాత్ర చేపట్టిన ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తంచేశారు. వేములవాడ రాజన్న సాక్షిగా మిడ్ మానేరు నిర్వాసితులకు రూ. 5 లక్షలు ఇస్తామన్న సీఎం హామీ ఏమైందని ప్రశ్నించారు. వెంటనే నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఊరికి 10 మంది చొప్పున 120 మంది పోటీ చేస్తామని హెచ్చరించారు.