చాలా కాలంగా టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కెసిఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఆ క్రమంలోనే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, గత మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి, మాజీ పీఎం దేవగౌడ, ఎన్సీపి నేత శరద్ పవార్ తదితర నేతలతో భేటీ అయి జాతీయ రాజకీయాలపై చర్చించారు. అయితే వీరిలో ఎంతమంది నేతలు కెసిఆర్ తో కలసి ప్రయాణం చేస్తారు అనేది ఇంత వరకు స్పష్టత అయితే రాలేదు. కాకపోతే కొన్ని పార్టీల నుండి సానుకూల సాంకేతాలు రావడంతో జాతీయ పార్టీ ప్రకటనకు కెసిఆర్ సిద్దమయ్యారు.
దీనితో ఇప్పటి వరకు ఉన్న సస్పెన్స్ కు ఆదివారం తెర దించారు. విజయదశమి రోజున మధ్యాన్నం 1.19 గంటలకు పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారు అయింది. ఆదివారం ముఖ్యమైన నేతలతో సమావేశం నిర్వహించి జాతీయ పార్టీపై చర్చించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొనగా భవిష్యత్ కార్యాచరణ పై కసరత్తు చేసారు. పార్టీ ప్రకటన రోజు ఉదయం 11గంటలకు మరో సారి 283 మంది ముఖ్య నేతలతో సమావేశమై జాతీయ పార్టీ పై సంతకాలు చేయనున్నారు. తీర్మానం పై సంతకాల సేకరణ అయిన తర్వాత ఖరారు చేసిన ముహూర్తంలో జాతీయ పార్టీ ప్రకటన ను కెసిఆర్ చేయనున్నారు. ఈ మేరకు కెసిఆర్ క్లారిటీ ఇచ్చేసారు.
ఆదివారం నిర్వహించిన సమావేశంలో పార్టీ పేరుపై చర్చించారని చివరకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరు పై ఎక్కువ మంది మొగ్గు చూపారని అంటున్నారు. గులాబీ జెండా, కారు గుర్తు యధా విధిగా ఉంచాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీకి, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని కెసిఆర్ ధీమాగా చెప్పారని అంటున్నారు. పార్టీ ప్రకటన తర్వాత డిసెంబర్ 9న దేశ రాజధాని ఢిల్లీలో బహిరంగ సభ నిర్వహించాలని కెసిఆర్ నిర్ణయించారుట. అదే విధంగా దేశ వ్యాప్తంగా పర్యటనలకు గాను 12సీట్ల చాపర్ (హెలికాప్టర్) కొనుగోలుకు ప్లాన్ చేసారని వార్తలు వినబడు తున్నాయి.
కన్నుల పండువగా తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. నేటి సేవల ఫోటోలు ఇవే