తెలంగాణలో ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ తొలి బహిరంగ సభ విజయవంతం అయ్యింది. కేసిఆర్ తో వేదిక పంచుకున్న డిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, వినరయి విజయన్, సీపీఐ జాతీయ నేత రాజా లు.. కేసిఆర్ కు మద్దతుగా నిలిచారు. తెలంగాణలో అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని తమ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామని ఆయా ముఖ్యమంత్రులు ప్రకటించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ కేసిఆర్ వెంట కేరళ ప్రజలు ఉంటారని అన్నారు. కేసిఆర్ ఆధ్వర్యంలో అధికార వికేంద్రీకరణ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ గడ్డపై వీరోచిత పోరాటం జరిగిందనీ, అలాంటి నేల నుంచి జాతికి మార్గం చూపించే మార్గం అభినందనీయమని పినరయి విజయన్ అభిప్రాయపడ్డారు. ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత కేసిఆర్ కు దక్కుతుందని అన్నారు. దేశంలో ప్రజలపై హింధీ భాషను బలవంతంగా రుద్దాలనే ప్రయత్నం జరుగుతుందని పేర్కొన్నారు. కేసిఆర్ పోరాటానికి తమ మద్దతు ఉంటుందని పినరయి విజయన్ అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే బీజేపీకి వ్యతిరేకంగా అందరం ఒక్కటై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. బీజేపీ సర్కార్ కార్పోరేట్ వ్యవస్థలకు కొమ్ము కాస్తుందని విమర్శించారు. ఫెడరల్ స్పూర్తికి విరుద్దంగా మోడీ పాలన సాగుతోందని దుయ్యబట్టారు కేరళ సీఎం పినరయి విజయన్.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ కేసిఆర్ తమకు పెద్దన్న లాంటి వారని అన్నారు. తమ ప్రజల కోసం అనేక మంది ముఖ్యమంత్రులు ఇతర రాష్ట్రాలలో అనుసరిస్తున్న విధానాలను అనుసరించడంలో తప్పులేదని పేర్కొన్నారు. ఢిల్లీలో అమలు అవుతున్న మొహల్లా క్లినిక్ లను తెలంగాణలో బస్తీ క్లినిక్ లుగా ఏర్పాటు చేశారని అన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ .. ఢిల్లీ లో స్కూళ్లను అధ్యయనం చేసి అక్కడ పాఠశాలల స్థితిగతులను మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. గవర్నర్ లను ఉపయోగించుకుని ముఖ్యమంత్రులను బీజేపీ ఇబ్బంది పెట్టాలని చూస్తుందని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలతో పాటు ఐటీ దాడులు ఎవరిపైన చేయించాలా అన్న ఆలోచనలోనే ప్రధాని మోడీ నిత్యం ఉంటారని విమర్శించారు. బీజేపీయేతర సీఎంలను ఎవరినీ ప్రశాంతంగా పని చేసుకోనివ్వడం లేదని ఆరోపించారు. అయినప్పటికీ బీజేపీకి ఎవరూ భయపడే పరిస్థితి లేదని అన్నారు. న్యాయంగా తమ పని తాము చేసుకుని వెళితే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ మాట్లాడుతూ.. రాష్ట్రాల్లో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుందని విమర్శించారు. దేశంలో అధికార మార్పిడి అవసరం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఎప్పుడూ కాలం ఒక్కలా ఉండదని అన్నారు. ఆశీర్వదించిన ప్రజలే తిరస్కరించిన ప్రభుత్వాలను అనేకం చూశామని పేర్కొన్నారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని అన్నారు. దేశానికి బీజేపీ ప్రమాదకారిగా మారిందనీ, బీజేపీ యేతర ప్రభుత్వాలు ఉన్న చోట్ల అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నిస్తుందని దుయ్యబట్టారు. విపక్షాలను కేసులతో భయపెట్టడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు.
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా మాట్లాడుతూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ సమాఖ్య స్పూర్తిని దెబ్బతీస్తున్నాయని విమర్శించారు. బారత్.. హిందూ దేశంగా మారే ప్రమాదం కనబడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ కార్పోరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. గవర్నర్ వ్యవస్థను బీజేపీ దుర్వినియోగం చేస్తొందనీ, కేరళ, తమిళనాడు, తెలంగాణ లో గవర్నర్ లు హద్దు మీరుతున్నారన ిఆయన ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగాలని పిలుపునిచ్చారు. బీజేపీ పై ఐక్య పోరాటానికి ఖమ్మం సభ నాంది కావాలని ఆయన అన్నారు. కేంద్రంలో బీజేపీని ఓడించడమే అందరి ముందు ఉన్న కర్తవ్యమని అన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలను ప్రశంసించారు.
ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని స్పష్టం చేశారు. ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం బాగా పెరిగిపోయిందని అన్నారు. జి – 20 అధ్యక్షత వహించడం భారత్ కు మంచి అవకామని, కానీ జి – 20 అంశాన్ని కూడా ఎన్నికలకు వాడుకుంటుందని విమర్శించారు అఖిలేష్. యూపీలోనూ బీజేపీ గద్దె దిగేందుకు కలిసి పని చేస్తామని ఆయన అన్నారు.
KCR: ఖమ్మం జిల్లాలో పంచాయతీ, మున్సిపాలిటీలకు పండుగే పండుగ .. రూ.కోట్లలో సీఎం కేసిఆర్ వరాలు