బీఆర్ఎస్ తొలి బహిరంగ ఖమ్మంలో ఏర్పాటు చేయడానికి పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసిఆర్ సిద్దమవుతున్న వేళ ఆ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు ఆ జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇటీవల సంచలన కామెంట్స్ చేసిన నేపథ్యంలో పొంగులేటి సెక్యురిటీని తగ్గించి కేసిఆర్ సర్కార్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పొంగులేటికి 3 ప్లస్ 3 పోలీస్ భద్రత ఉండగా, దాన్ని 2 ప్లస్ 2 కి తగ్గించడంతో పాటు ఆయకు ఎస్కార్ట్ ను, నివాసం వద్ద ఉండే గన్ మెన్ లను కూడా ప్రభుత్వం తొలగించింది. ఈ పరిణామం నేపథ్యంలో బీజేపి నేత గల్లా సత్యనారాయణ ఇటీవల స్పందిస్తూ.. బీఆర్ఎస్ లో పొంగులేటికి సరైన ప్రాధాన్యత లభించడం లేదని పేర్కొన్నారు. పొంగులేటి పార్టీ మారతారన్న ఉద్దేశంతోనే ఆయనకు ఉన్న సెక్యురిటీని తగ్గించారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున భద్రత కల్పించకపోతే కేంద్ర ప్రభుత్వం ద్వారా తామే పొంగులేటికి భద్రత కల్పిస్తామంటూ ఆయన సంచలన స్టేట్ మెంట్ ఇచ్చారు.
దీంతో పొంగులేటి భీజేపీ చేరికకు సుముఖంగా ఉన్నారని సంకేతాలు వెలువడ్డాయి. ఆ వ్యాఖ్యలు బలం చేకూర్చేలా పొంగులేటి నియోజకవర్గంలోని తన వర్గీయులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్బంగా జనవరి 1వ తేదీన భారీ ఎత్తున నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో, ఆ తర్వాత పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. తన వర్గీయుల్లో అర్హత ఉన్న వారందరూ రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారని పేర్కొన్నారు. పార్టీ మార్పు అంశంపై పొంగులేటి ఇంత వరకూ బహిరంగంగా వ్యాఖ్యానించకపోయినా పార్టీలో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి అర్ధం అవుతోంది. బీజేపీ అధిష్టానం నేరుగా ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తొంది. బీజేపీ కీలక నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోనే పొంగులేటి ఈ నెల 18వ తేదీన భేటీ అవుతారని ప్రచారం జరుగుతోంది. ఆయన నుండి స్పష్టమైన హామీ అందిన తర్వాతనే కాషాయం కప్పుకోవచ్చని స్పష్టం అవుతోంది.
కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన పొంగులేటి వివిధ హోదాల్లో పని చేశారు. 2013లో వైసీపీ లో చేరారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా కొంత కాలం పని చేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా ఖమ్మం లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి నాటి టీడీపీ అభ్యర్ధి నామా నాగేశ్వరరావు పై విజయం సాధించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో లోక్ సభ టికెట్ ఆశించినా పార్టీ అధిష్టానం నామా నాగేశ్వరరావుకు ఇవ్వడంతో ఆయన గెలుపునకు కృషి చేశారు. ఆ తర్వాత ఆయనకు పదవులు ఇస్తారనే ప్రచారం జరిగింది కానీ ఏ పదవీ రాలేదు. ఆ నేపథ్యంలో పొంగులేటి పార్టీ మారతారంటూ కూడా ప్రచారం జరిగింది. ఆయితే ఆ ప్రచారాన్ని గతంలో పొంగులేటి ఖండించారు. పార్టీలోనే కొనసాగారు. ప్రస్తుతం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని తన అనుచర వర్గంతో సమావేశాలను నిర్వహిస్తున్నారు పొంగులేటి.
మరో పక్క ఈ నెల 18న ఖమ్మం కేంద్రంగా బీఆర్ఎస్ మొదటి బహిరంగ సభ నిర్వహించేందుకు ఆ పార్టీ ప్లాన్ చేస్తొంది. తొలుత బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ ఢిల్లీలో ఏర్పాటు చేయాలని భావించినా ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఖమ్మంను ఎంచుకున్నట్లు తెలుస్తొంది. 18న ఖమ్మంలో సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసిఆర్ విచ్చేస్తున్న నేపథ్యంలో అదే రోజు బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించినట్లుగా సమాచారం. ఈ మేరకు సీఎం కేసిఆర్ ఆదివారం రాత్రి మంత్రి పువ్వాడ అజయ్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావులతో పాటు వరంగల్లు, తదితర జిల్లాలకు చెందిన మంత్రులతో సమావేశమై చర్చించారు. ఖమ్మం సభకు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులతో పాటు పలువురు మాజీ సీఎంలు, పలు రాష్ట్రాల్లోని బీఆర్ఎస్ అనుకూల పార్టీల నేతలను ఆహ్వానించనున్నారు. ఈ తరుణంలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన వర్గీయులతో బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చి బీజేపీలో చేరికకు అడుగులు వేస్తుండటం ఖమ్మం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.