Komatireddy Rajagopal Reddy: హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం హీట్ ఎక్కింది. టీఆర్ఎస్ ను వీడిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ తరపున పోటీ చేయనుండటంతో అధికార టీఆర్ఎస్ ఆ నియోజకవర్గంలో ఫుల్ ఫోకస్ పెట్టింది. ఎన్నికల్లో లబ్దికోసం టీఆర్ఎస్ సర్కార్ పెద్ద ఎత్తున తాయిలాలు ప్రకటిస్తోందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనిపై తాజాగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉప ఎన్నికలు ఉన్నందునే హుజూరాబాద్ నియోజకవర్గంలో వేల కోట్లను ఖర్చు చేస్తున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. మునుగోలు నియోజకవర్గ అభివృద్ధికి రూ.2వేల కోట్లు ఇస్తే తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని ఎన్ని మార్లు అడిగినా ఇవ్వలేదనీ, కేవలం సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కు మాత్రమే నిధులు ఇస్తున్నారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.
హూజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తున్న దళిత బంధు పథకంపై ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో లబ్దిపొందేందుకు హుజూరాబాద్ లో అన్ని ఎస్సీ కుటుంబాలకు నిధులు ఇస్తున్నారని ఆరోపించారు. కానీ ఇతర నియోజకవర్గాల్లో వంద కుటుంబాలకే సాయం చేస్తామనడం సమంజసమేనా అని ప్రశ్నించారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి.
ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలపై సీఎం కేసిఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారు. ఇటీవలే హుజూరాబాద్ పట్టణ అభివృద్ధికి రూ.35కోట్లు కేటాయించారు. పలువురు మంత్రులు నియోజకవర్గంలోనే మకాం వేసి అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పార్టీ అధిష్టానానికి తెలియజేస్తున్నారు. పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్న దళిత బంధు పథకం కింద రూ.1500 నుండి 2వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఇంతకు ముందే సీఎం కేసిఆర్ వెల్లడించారు.