Komatireddy venkatreddy: జాతీయ పార్టీ కాంగ్రెస్ లో నాయకులకు వాక్ స్వాతంత్రం ఎక్కువ. ప్రాంతీయ పార్టీల మాదిరిగా క్రమశిక్షణ ఉండదు. అది అందరికి తెలుసు. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఎవరు తోచిన విధంగా వారు మాట్లాడుతుంటారు. ఆ స్వాతంత్రం ఉంటుంది. పార్టీ స్టాండ్ కు భిన్నంగా కూడా వ్యవహరిస్తుంటారు. ఇప్పుడు ఇది అంతా ఎందుకు అంటే..దివంగత సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్బంగా అయన సతీమణి విజయమ్మ హైదరాబాద్ నోవా టెల్ లో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట రెడ్డి హాజరయ్యారు. వైఎస్ ఆర్ అమలు చేసిన సంక్షేమ పధకాలను ఏకరువు పెట్టి ఆయనను స్మరించుకొని నివాళులు అర్పించారు. అంత వరకు బాగానే ఉంది.
అనంతరం వెళ్లే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ కు భిన్నంగా ఈ కార్యక్రమంకు హాజరు కావడంపై మీడియా ప్రశ్నించగా కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేసినట్లు వదిన విజయమ్మ చెప్పి ఆహ్వానించారు. మూడు రోజుల క్రితమే వస్తాను అని మాట ఇచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం కార్యక్రమంలో పాల్గొని అన్న వైఎస్ఆర్ గురించి నాలుగు మాటలు చెప్పాను. ఇది షర్మిల పార్టీ కార్యక్రమం కాదు, ఇక్కడ ఆమె ఫోటోలు, ఫ్లెక్సీ లు లేవు, వేరే పార్టీ కార్యక్రమానికి పాల్గొనలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా పని చేశారు. వైఎస్ ఆర్ నా అభిమాన నాయకుడు అందుకే వచ్చాను” అని చెప్పారు.
అంతటితో ఆగకుండా వేరే పార్టీ నాయకుడి ఇంటికి వెళ్లి రాఖి కట్టలేదు అంటూ ఇండైరెక్ట్ గా ఎమ్మెల్యే సీతక్క ను ఉద్దేశించి సెటైర్ వేశారు. మూడు గంటల ముందు నిర్ణయం తీసుకోని కార్యక్రమానికి వెళ్ళవద్దు అని చెపితే వినడానికి చిన్న పిల్లగాడిని కాదు అంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. అయితే టీ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి చేసిన సంచలన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారింది. కోమటిరెడ్డి రెడ్డి వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి.