Konda Surekha: తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఈటల వర్సెస్ కేసిఆర్ అన్నట్లుగా ఉన్న సంగతి తెలిసిందే. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ ఉప ఎన్నికల అని వార్యం కాగా నియోజకవర్గంలో తన పట్టు, సామర్థ్యం ఏమిటో నిరూపించుకోవాలని ఈటల బీజేపి అభ్యర్ధిగా రంగంలోకి దిగుతుండగా, ఈటలను ఓడించడం ద్వారా తెలంగాణలో కేసిఆర్, టీఆర్ఎస్ హావా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకునేందుకు కేసిఆర్ సర్కార్ సర్వశక్తులు వడ్డుతోంది. ఇప్పటికే బీజేపీ నేతలతో ఈటల నియోజకవర్గంలో పర్యటిస్తుండగా, మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు మంత్రులు టీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈటల (బీజేపీ) వర్సెస్ కేసిఆర్ (టీఆర్ఎస్) నువ్వా నేనా అన్న పోటీ హుజూరాబాద్ లో నెలకొనగా కాంగ్రెస్ పార్టీ నుండి ఇంత వరకూ అభ్యర్థిని ప్రకటించలేదు.
కొద్ది రోజులుగా మాజీ మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే పార్టీని పలువురు ముఖ్య నేతలు స్థానికులకే టికెట్ కేటాయించాలని అభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ..స్థానిక నేతల నుండి ధరఖాస్తులను స్వీకరించింది. ఈ తరుణంలో మాజీ మంత్రి కొండ సురేఖ హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేసే అంశంపై కీలక ప్రకటన చేశారు. తాను హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు సిద్దమేననీ ప్రకటిస్తూనే ఓ కండిషన్ పెట్టారు. వరంగల్లు తూర్పు నియోజకవర్గం సీటును తమ కుటుంబానికి ఇస్తామని పార్టీ అధిష్టానం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు కొండా సురేఖ. కొద్ది రోజులుగా సురేఖ పోటీ చేసే అంశంపై ఊహాగానాలు వస్తున్నా నిన్న స్వయంగా ఆమె పోటీకి సిద్ధమని ప్రకటించడంతో దాదాపు ఆమె అభ్యర్థిత్వం ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే సురేఖ కండిషన్ కు పార్టీ అధిష్టానం ఓకే చెబుతుందా లేక స్థానికులకే ప్రాధాన్యత ఇస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది.