YS Sharmila: తెలంగాణలో రాజన్నరాజ్యం లక్ష్యంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ ప్రారంభించి దూసుకువెళుతున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ అభిమానులను తమ పార్టీ ఆకర్షించుకుంటూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నిరుద్యోగ సమస్యపై ప్రతి మంగళవారం దీక్షలు నిర్వహిస్తున్నారు. తరచు కేసిఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయి విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఆమె రాజకీయ పార్టీ ఆరంభించిన తరువాత ఎవరూ ఆమెపై వ్యక్తిగతంగా తీవ్ర స్థాయిలో విమర్శించిన లేదా ఆరోపణలు చేసిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు వైఎస్ షర్మిలపై వ్యక్తిత్వంపై దివంగత వైఎస్ఆర్ కు వీర విధేయురాలైన మాజీ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో కొండా సురేఖ షర్మిల పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కొండా సురఖ ఆయన మరణానంతరం షర్మిల నిర్వహించిన పాదయాత్రలో ఆమెతో కలిసి పాల్గొన్నారు. వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగన్ పక్షాన నిలిచారు. వైఎస్ఆర్ పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చినందుకు ఆమె ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేశారు. అటువంటి కొండా సురేఖ నేడు షర్మిల పై ఆ విధంగా విమర్శలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి కల్గించింది. తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టడంతో కొండా దంపతులను పార్టీలోకి ఆహ్వానిస్తారని, వారు పార్టీలో చేరతారని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఆ వదంతులను కొండా సురేఖ కొట్టిపారేయడమే కాక షర్మిలపైనే ఘాటు వ్యాఖ్యలు చేశారు.
“షర్మిలకు ఈగో ఎక్కువ. ఆమె పార్టీలో చేరే ఆలోచన లేదు. జగన్మోహనరెడ్డి జైలుకు వెళ్లిన తరువాత ఆమెతో పాదయాత్ర చేసిన సందర్భంలో ఆమె బాడీ లాంగ్వేజ్ చూశాను, షార్ట్ టెంపర్ ఉంది, రాజకీయాల్లో ఉండే వారికి అది పనికి రాదు. రాజకీయాల్లో ఉండాలంటే సాఫ్ట్ గా, ప్రజలతో ఫ్రెండ్లీ గా ఉండాలి. ప్రజల్లో నార్మల్ గా వెళ్లపోవాలి కానీ హైఫైలో వెళ్లిపోతే కుదరదు. ఇప్పుడు అంతా ఆమె చేస్తుంది డ్రామా యాక్టింగ్, పేయిడ్ ఆర్టిస్ట్ మాదిరిగా వాళ్లదంతా జరుగుతోంది. వాళ్ల దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి. బ్రదర్ అనిల్ ప్రపంచ వ్యాప్తంగా పైసలు తేగలడు. అన్న అక్కడ ఒక తీరు మాట్లాడి ఇక్కడ చెల్లి ఒక తీరు మాట్లాడుతున్నారు. ఆమె అధికారం కోసం, స్వార్ధం కోసం వచ్చింది. ఇద్దరు కలిసి నువ్వ అక్కడ సీఎం అయి నేను ఇక్కడ సిఎం అయి తెలంగాణ ను ముంచి ఆంధ్రాను బాగుచేసుకుందామని ప్లాన్ తో వచ్చారా లేదా తెలియదు. తల్లి విజయమ్మ ఈ స్టేజ్ మీదకు వచ్చి నా బిడ్డకు మీకు అప్పగిస్తున్నా అంటున్నారు. ఆ స్టేజీ మీదకు వెళ్లి నా బిడ్డను మీకు అప్పగిస్తున్నా అంటున్నది, అసలు తెలంగాణ పబ్లిక్ ఏమైనా పిచ్చేళ్లా” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై వైఎస్ఆర్ టీపీ, షర్మిల ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.