Konda Visweswar Reddy : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రానురాను దిగజారుతోంది. ఆ పార్టీకి చెందిన నాయకులు ఇప్పట్లో పార్టీకి భవిష్యత్తు లేదని పక్క చూపులు చూస్తున్నారు. టీ కాంగ్రెస్ లో వర్గ విభేధాలు కారణంగా ఇంత వరకూ పీసీసీ అధ్యక్షుడి నియామకం కూడా జరగలేదు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ టీ పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే కొత్త అధ్యక్షుడు నియామకం వరకూ ఉత్తమ్ కుమార్ రెడ్డినే కొనసాగాలని పార్టీ అధిష్టానం సూచించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం సినీనటి, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా చేవెళ్ల మాజీ ఎంపి కొండా విశ్వేశ్వరరెడ్డి నేడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. సోమవారం కొండా విశ్వేశ్వరరెడ్డి తన రాజీనామా లేఖను ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపారు.
హైదరాబాదు – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దిగిన నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఆయనకు నష్టం జరగకుండా ఉండటం కోసమే కొండా విశ్వేశ్వరరెడ్డి తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించలేదని తెలుస్తోంది. కొండా విశ్వేశ్వరరెడ్డి త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోనే బీజేపీ తెలంగాణ రాష్ట ఇన్ చార్జి భూపేందర్ యాదవ్ తో కొండా సమావేశం అయినట్లు వార్తలు వచ్చాయి,. చేవెళ్ల ఎంపి స్థానం నుండి పోటీ చేయాలని భావిస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డికి బీజెపీ నుండి స్పష్టమైన హామీ వచ్చిందనీ, అందుకే ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ నుండి హామీ లబించడం వల్లనే కొండా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం. త్వరలో తాను బీజేపీలో చేరనున్నట్లు ఆయన తన అనుచరులకు ఫోన్ చేసినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.