తెలంగాణలో ఇటీవల కాలంలో బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని భావించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత పొంగులేటి శ్రీనివాసరావు, జూపల్లి కృష్ణారావు తదితరులు బీజేపీలో చేరతారని కూడా వార్తలు వచ్చాయి. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సహా పలువురు బీజేపీ నేతలు పొంగులేటి నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. కానీ పార్టీలో చేరికపై ఇంత వరకూ పొంగులేటి, జూపల్లి ఇంత వరకూ క్లారిటీ ఇవ్వలేదు. కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం, టీపీసీసీ అధ్యక్షుడు ఘర్ వాసవీ నినాదం అందుకోవడంతో నాయకుల్లో కొంత డైలమా నెలకొంది. బీఆర్ఎస్ కు రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ నా లేక బీజేపీ నా అదే దానిపై నేతల్లో సందిగ్దత కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వశ్వరరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఈటల రాజేందర్ తో కలిసి కొందరు నేతలు పార్టీ పెడతారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. రాష్ట్రంలో మరో కొత్త ప్రాంతీయ పార్టీకి అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టు కావడం ఖాయమని అంతా అనుకున్నారనీ, కానీ ఆమె అరెస్టు కాకపోవడంతో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఏదో అవగాహన ఉందని ప్రజలు అనుకుంటున్నారని కొండా అన్నారు. దీని వల్లనే తెలంగాణలో బీజేపీ లో చేరికలకు బ్రేక్ లు పడ్డాయని ఆయన అభిప్రాయపడ్డారు.
బీజేపీ, బీఆర్ఎస్ లు గల్లీలో కుస్తీ .. ఢిల్లీలో దోస్తీ అని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇది బీజేపీకి తెలంగాణలో పెద్ద సంకటంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పొంగులేటి, జూపల్లి లాంటి నాయకులు చేరికలు ఆగిపోయాయని అభిప్రాయపడ్డారు. ఈటెలతో కలిసి కొందరు కొత్త పార్టీ పెడతారనేది అవాస్తమని అంటూ ఒక వేళ ఎవరైనా పార్టీ పెట్టే ఆలోచన చేస్తే కేసిఆర్ పురిటిలోనే చంపేస్తారని విశ్వేశ్వరరెడ్డి అన్నారు.