Kousik Reddy: మాజీ మంత్రి ఈటల రాజీనామాతో హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబందించి త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కాకమునుపే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి నుండే నేతలు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈటల రాజేందర్ బీజెపి నేతలతో కలిసి నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తుండగా, టీఆర్ఎస్ మంత్రులు విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తూ తాయిలాలు ప్రకటిస్తున్నారు. కేసిఆర్ సర్కార్ పెద్ద ఎత్తున నిధులను విడుదల చేయడంతో పాటు దళిత బంధు కార్యక్రమాన్ని నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నది. టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల తూటాలుగా పేలుతున్నాయి.
ఇక విషయానికి వస్తే ప్రధాన పార్టీల తరపున అభ్యర్థులు ఎవరు అవుతారు అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. బీజేపీ తరపున ఈటల రాజేందర్ కన్ఫర్మ్ అనుకుంటున్న తరుణంలో ఇటీవల ఈటల సతీమణి జముల ఓ బాంబు పేల్చారు. అభ్యర్థిగా తన భర్త రాజేందర్ అయినా, తాను అయినా ఒకటేననీ పార్టీ గుర్తు ఏమీ మారదన్నారు. ఎవరు పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. అంటే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు అవుతారో చూసి దాన్ని బట్టి క్యాస్ట్ ఈక్వేషన్స్ పరిశీలించి అభ్యర్థి ఎంపికపై బీజేపీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు.
మరో పక్క టీఆర్ఎస్ విషయాన్ని వస్తే ఆ పార్టీలో ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి, బీజేపీ నుండి రాజీనామా చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి. వీరికంటే ముందు టీటీడీపీ అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహించిన ఎల్ రమణలు టీఆర్ఎస్ గూటికి చేరడంతో హుజూరాబాద్ టికెట్ వీరిలో ఒకరికి కేటాయించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి టీఆర్ఎస్ లో చేరకమునుపే కౌశిక్ రెడ్డి తాను టీఆర్ఎస్ అభ్యర్థినందూ ఓ కార్యకర్తతో మాట్లాడిన ఆడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో టీఆర్ఎస్ టిటెక్ కౌశిక్ రెడ్డికి ఖాయం అవుతుందని అందరూ ఊహించారు. ఇటీవలే సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోవడంతో కౌశిక్ రెడ్డి పరిస్థితి ఏమిటి అన్న సందేహాలు తలెత్తాయి.
అయితే అనూహ్యంగా కౌశిక్ రెడ్డికి జాక్ పాట్ తగిలింది. పార్టీలో చేరి నెలరోజులు కూడా గవడకముందే టీఆర్ఎస్ పార్టీ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది. నిన్న తెలంగాణ క్యాబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. గవర్నర్ కోటాలో పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాలని నిర్ణయించిన టీఆర్ఎస్ ఆ మేరకు గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ కు సిఫార్సు చేస్తూ లేఖ రాసినట్లు సమాచారం. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడంతో హుజూరాబాద్ టికెట్ అదే సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం లేదని స్పష్టం అవుతోంది.
దీంతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. ఇదిలా ఉంటే గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేసిన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత స్వర్గం రవి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. పారిశ్రామికవేత్త అయిన రవి నియోజకవర్గంలో తన కంటూ సొంత క్యాడర్ ఎర్పాటు చేసుకుని ఉన్నారు. నియోజకవర్గంలో ఈటలను సమర్థవంతంగా ఢీకొట్టాలంటే నియోజకవర్గంలో సొంత క్యాడర్ ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతనే బరిలో దించాలని టీఆర్ఎస్ యోచిస్తుందనీ, అందుకే పోటీ నుండి తప్పించేందుకు కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఇక టీఆర్ఎస్ టికెట్ స్వర్గం రవికి కన్ఫర్మ్ చేస్తారా లేక మరో నాయకుడిని ఎంపిక చేస్తారా అనేది వేచి చూడాలి.