KTR : తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తనయుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ సాక్షిగా ఇప్పుడు కొత్త గేమ్ నడుస్తోందా? ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకే విషయంలో ఆయన్నే టార్గెట్ ఎందుకు చేస్తున్నాయి? ఒకరి తర్వాత ఒకరి సవాల్లు – ప్రతి సవాళ్లు ఎందుకు చేస్తున్నారు? ఇది ఇప్పుడు హాట్ టాపిక్ తెలంగాణ రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతుండడంతో… ఇప్పుడు ఉద్యోగాల విషయంపై చర్చ హీటు పుట్టిస్తోంది. ఇందులో ప్రధానంగా టార్గెట్ అవుతోంది కేటీఆర్.
అధికార ప్రతిపక్షాల మాటల యుద్ధం.
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ప్రతిష్టాత్మకంగా మారడంతో అధికారపక్షంతో పాటు.. ప్రతిపక్షాలు ఈ విషయంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాయి. టీఆర్ఎస్ నుంచి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు సురభి వాణిదేవి బరిలోకి దిగగా.. సిట్టింగ్ ఎమ్మెల్సీ అయిన రామచందర్రావు కూడా మరోసారి పోటీకి దిగారు. ఈ సీటును దక్కించుకునే క్రమంలో ఆయా పార్టీల నేతల మధ్య రాజకీయ ఆరోపణలు, విమర్శలు రోజురోజుకీ పెరిగితున్నాయి… సవాళ్లు, ప్రతిసవాళ్లు, బహిరంగలేఖలు ఇలా ఉద్యోగాల విషయంపై చర్చ సాగుతూనే ఉంది.
కేటీఆర్ అలా అన్నారు… బీజేపీ ఇలా రియాక్టైంది.
ఉద్యోగాల విషయంతో పాటు.. గత ఆరేళ్లలో బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్రావు చేసింది ఏమీలేదని మంత్రి కేటీఆర్ విమర్శించిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా మంత్రి కేటీఆర్కు బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్రావు బహిరంగ లేఖ రాశారు. సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్ ముందు చర్చ కు రావాలని సవాల్ విసిరారు. తన సవాల్ ని స్వీకరించి ఓయూ ఆర్ట్స్ కాలేజ్ కి వచ్చి ఉద్యోగాలు, ఇతర అంశాలను నిరూపిస్తూ తాను ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని.. బహిరంగ చర్చకు రాకుంటే తన పైన చేసిన అసత్యపు ఆరోపణలకు మంత్రి కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని రామచందర్రావు డిమాండ్ చేశారు. కాగా, ఇదే ఉద్యోగాల విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ గన్ పార్క్ వద్ద చర్చకు రావాలని సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.