KTR : తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తనయుడు కేటీఆర్ తమ రాజకీయ ప్రత్యర్థుల విషయంలో ఎంత అలర్ట్గా ఉంటున్నారో తెలియజేసేందుకు ఇదో ఉదాహరణ. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాల విషయం హాట్టాపిక్గా మారిపోయింది. తమ సర్కార్ వచ్చిన తర్వాత ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామని చర్చకు సిద్ధమంటూ మంత్రి కేటీఆర్ సవాల్ చేయడంతో..
విపక్షాల నుంచి కూడా అదే రేంజ్లో ప్రతిసవాళ్లు వచ్చాయి. ఏకంగా ఉస్మానియా యూనివర్సిటీకి రావాలని ఒకరు … గన్ పార్క్ కు రావాలని మరొకరు సవాల్ విసిరారు. దీంతో తమ ప్రభుత్వ హయంలో భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలు ఇవి అంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ విడుదల చేశారు.
KTR కేటీఆర్ ఏమంటున్నారంటే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లల్లో 24 వేల ఉద్యోగాల భర్తీ మాత్రమే చేసిందని పేర్కొన్న కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,32,799 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేసిందని..దీనిపై తాను చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. దీనిపై ప్రతిపక్షాలు ఘాటుగా స్పందించాయి. బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్రావు.. మంత్రి కేటీఆర్కు ప్రతిసవాల్ విసిరారు. కేటీఆర్తో లైవ్ చర్చకు సిద్ధమన్న ఆయన.. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ముందు చర్చించే దమ్ముంటే రావాలంటూ మంత్రి కేటీఆర్కు సవాల్ చేశారు .
కాంగ్రెస్ తక్కువ తినలేదు
నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడ పోయాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. ఉద్యోగాలను కల్పించామని కేటీఆర్ అబద్దం చెబుతున్నారని మండిపడ్డారు. ప్రగతి భవన్ లో కూర్చొని డ్రామాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. మీ కోసమేనా యువత బలిదానాలు చేసుకున్నదని… కవిత ఓడిపోతే ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చే వరకు నిద్రపోలేదని.. లక్ష 32 వేల ఉద్యోగాలు.. ఇచ్చాం అని ఎట్ల చెబుతారని నిలదీశారు. ఈ నెల 26న 12 గంటలకు గన్ పార్క్ వద్ద ఉద్యోగాల భర్తీపై బహిరంగ చర్చకు సిద్ధమని కేటీఆర్ కు సవాల్ విసిరారు. లేదంటే ఉద్యోగాల భర్తీపై అన్ని అబద్దాలేనని కేటీఆర్ ఒప్పుకోవాలని తెలిపారు.
కేటీఆర్ ఫైర్….
ఉద్యోగాలపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని… అర్థసత్యాలు, అసత్యాలతో యువతను గందరగోళంలోకి నెడుతున్నాయని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలు నిజాలను దాడి… అబద్దాలను ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. 2014 నుంచి 2020 వరకూ లక్షా 32,899 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. అధికారంలోకి వస్తే ఉద్యోగాలిస్తామన్న మాటను నిలబెట్టుకున్నామని కేటీఆర్ తెలిపారు. త్వరలోనే మరో 50 వేల ఉద్యోగాల భర్తీ చేస్తామని… ఎలక్షన్ కోడ్ ముగియగానే భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తామని కేటీఆర్ వెల్లడించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?