KTR Vs Bandi Sanjay: తెలంగాణలో ఓ పక్క టీఆర్ఎస్, బీజేపీ లోపాయికారీ బంధంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. సీఎం కేసిఆర్ ఢిల్లీలో టీఆర్ఎస్ భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి వెళ్లి, అనూహ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. కేసిఆర్ ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలిసిన తరువాతే హుజూరాబాద్ ఉప ఎన్నిక వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి. దీనికి తగ్గట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉప ఎన్నికల నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పండుగల తరువాత ఉప ఎన్నిక నిర్వహిస్తే బాగుంటుందని సూచన చేసిన తరువాతనే కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ, ఏపిలోని హుజూరాబాద్, బద్వెల్ అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
కేసిఆర్ అడిగిన వెంటనే కేంద్రంలోని పెద్దలు అందరూ అపాయింట్మెంట్ వెంటనే ఇవ్వడం తెలిసిందే. దీంతో టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఒ రహస్య ఒప్పందం ఉందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు లంకించుకున్నారు. గల్లీలో కుస్తీ..ఢిల్లీలో దోస్తీ ఇదీ టీఆర్ఎస్, బీజేపీ తీరు అంటూ విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉంటే రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజ్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది సవాళ్లువిసురు కుంటున్నారు.
KTR: నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తా… సంజయ్ సిద్ధమా
ఆరున్నర సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్రానికి రూ.2.72 లక్షల కోట్లు వెళితే, రాష్ట్రానికి కేంద్రం రూ.1,42 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందనీ, ఇది నిజం కాకపోతే నేను రాజీనామా చేస్తాను, బండి సంజయ్ ఎంపి పదవికి రాజీనామా చేస్తారా అంటూ కేటిఆర్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు మొత్తం నిధులు కేంద్రమే ఇస్తుంటే బీజేపీ పాలిత కర్నాటక రాష్ట్రంలో ఈ పథకాలు ఎందుకు లేవని కేటిఆర్ ప్రశ్నించారు. కేంద్రానికి తెలంగాణ నుండి రూపాయి వెళితే తిరిగి రాష్ట్రానికి కేంద్రం నుండి అర్థ రూపాయి మాత్రమే ఇస్తుందని కేటిఆర్ ఆరోపించారు. తెలంగాణ పన్నులను ఇతర రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్నారనీ, రాష్ట్రాన్ని ప్రధాన మంత్రి మోడీ దగా చేస్తున్నారని కేటిఆర్ మండిపడ్డారు.
కేటిఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందిస్తూ కేటిఆర్ ఒక అజ్ఞాని, తుపాకీ రాముడు, అతని మాటలు ఎవరు పట్టించుకుంటారు అని బండి వ్యాఖ్యానించారు. యూపీఏ హయాంలో రాష్ట్రానికి 32 శాతం నిధులు ఇస్తే, ఎన్డీఏ వచ్చిన తరువాత 9 శాతం పెంచి 42 శాతం ఇస్తున్నామని సంజయ్ తెలిపారు. పన్నుల విషయంలో రాష్ట్రానికి, కేంద్రానికి చట్టం ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రులు పొగిడినట్లు లీకులు ఇస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్ లో కొత్త సచివాలయం పూర్తి అయ్యేనాటికి కేసిఆర్ సర్కార్ ఉండదని బండి జోస్యం చెప్పారు. సచివాలయానికి వెళ్లని వారికి కొత్తది ఎందుకని ప్రశ్నించారు. ఇలా కేటిఆర్, బండి సంజయ్ సవాళ్లు, విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది.
Read More:
1.Revanth Reddy: కేసిఆర్ వ్యూహాన్ని పసిగట్టిన రేవంత్ రెడ్డి..! క్యాడర్ కు హెచ్చరికలు..!!
2.CM KCR: మాజీ మంత్రి మోత్కుపల్లికి కేసిఆర్ సర్కార్ లో కీలక పదవి..? ఇదీ సాక్షం..!!
3.Perni Nani: ఆన్లైన్ సినిమా టికెట్లపై మేధోబలుల దుష్ప్రచారం అంటూ మంత్రి పేర్ని సెటైర్లు..