తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పదవికి హోరాహోరీ పోరు జరిగింది. ఈ పోరులో కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యేగా పని చేసిన కూనంనేని సాంబశివరావు 14 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో సీపీఐ మూడవ రాష్ట్ర మహాసభ బుధవారం జరిగింది. కార్యదర్శి ఎన్నికపై అర్ధరాత్రి వరకూ నేతల మధ్య వాడి వేడి చర్యలు నడిచాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు సార్లు చాడ వెంకటరెడ్డి పార్టీ కార్యదర్శిగా ఎన్నికైయ్యారు. పార్టీ నియమావళి ప్రకారం మూడు సార్లు మాత్రమే కొనసాగే అవకాశం ఉంది. దీంతో మూడో సారి తనకు అవకాశం ఇవ్వాలని చాడ కోరినట్లు సమాచారం. అయితే ఈ సారి తనకు అవకాశం కల్పించాలని మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఉన్న కూనంనేని సాంబశివరావు పట్టుబట్టినట్లు సమాచారం.
ఇది ఇద్దరి మధ్య పోటీకి దారితీయడంతో.. ఏకగ్రీవం అయితేనే తాను కొనసాగుతాననీ, ఒక వేళ పోటీ అనివార్యమైతే తాను విరమించుకుంటానని చాడ ప్రకటించినట్లు తెలిసింది. ఈ తరుణంలోనే పల్లా వెంకటరెడ్డి పేరును రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదనను చాడ తీసుకువచ్చారు. దీంతో కార్యదర్శి పదవికి కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకటరెడ్డి మద్య గట్టి పోటీ జరిగింది. ఇద్దరికీ జిల్లాల వారిగా సీపీఐ నేతలు విడిపోయారు. హైదరాబాద్, ఖమ్మం జిల్లా నేతలు కూనంనేని సాంబశివరావుకు మద్దతుగా తెలపగా, నల్లగొండ జిల్లా నేతలు పల్లా వెంకటరెడ్డికి మద్దతుగా నిలిచారు. బుధవారం అర్ధరాత్రి వరకూ ఈ ఎన్నిక జరగ్గా, కూనంనేని సాంబశివరావుకు 59 ఓట్లు, పల్లా వెంకటరెడ్డికి 45 ఓట్లు వచ్చాయి. దీంతో కూనంనేని సాంబశివరావు పార్టీ కార్యదర్శిగా ఎన్నికైనట్లు సీపీఐ తెలిపింది. రెండు సార్లు కార్యదర్శిగా పని చేసిన చల్లాకు అవకాశం దక్కకపోగా, ఆయన ప్రతిపాదించిన పల్లా వెంకటరెడ్డి పరాజయం పాలయ్యారు.
మంత్రులకు సీరియస్గా క్లాస్ పీకిన ఏపి సీఎం వైఎస్ జగన్..ఎందుకంటే..?