గత కొద్దికాలంగా తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ , కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్య జరుగుతున్న రాజకీయం గురించి కొత్త చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీర్ ఢిల్లీ టూర్ తర్వాత ఈ చర్చ మరింత హాట్ హాట్ హాట్గా మారింది. బీజేపీకి టీఆర్ఎస్ దగ్గరవుతోందనే ప్రచారం మొదలైంది. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ అలాంటి వారికి మరింత చర్చ పెట్టుకునే చాన్సిచ్చారని అంటున్నారు.
ఈటల రాజేందర్ ఏం చేశారంటే…
దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం కావడంతో మంత్రి ఈటల రాజేందర్ టీకా వేయించుకుంటారని వార్తలు వచ్చాయి. గాంధీ ఆస్పత్రిలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో కలిసి వ్యాక్సినేషన్ను ప్రారంభించిన ఈటల.. వ్యాక్సిన్ మాత్రం తీసుకోలేదు… ముందుగా నిర్ణయించిన ప్రకారం.. మొదటి వాక్సిన్ పారిశుద్ధ్య కార్మికురాలు కర్మచారి కృష్ణమ్మకే ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన… తాను ముందుగా వ్యాక్సిన్ ఎందుకు తీసుకోలేదో వివరించారు. ప్రాణాలకు తెగించి డాక్టర్లు, నర్సులు, శానిటేషన్ సిబ్బంది కరోనా పై యుద్ధం చేస్తున్నారని గుర్తుచేసిన ఈటల.. ప్రాణ త్యాగం కూడా చేశారన్నారు. వారిని గుర్తు చేసుకొని ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు.. వారికి ముందు వాక్సిన్ అందించాలని ప్రధాని సూచించారు.. అందుకే మొదటి వాక్సిన్ సఫాయి కర్మచారి కృష్ణమ్మకే ఇచ్చాము.. అందుకే నేను ఈ రోజు వాక్సిన్ తీసుకోలేదంటూ క్లారిటీ ఇచ్చారు.
మోడీ చెప్పడంతోనే కేటీఆర్ ఇలా…
శనివారం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్లో కోవిడ్ వ్యాక్సినేషన్ను ప్రారంభించిన తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రదాని నరేంద్ర మోడీ సూచనలతోనే మేం ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోవడం లేదని కేటీఆర్ అన్నారు. “ ముందుగా ప్రజా ప్రతినిధులు వాక్సిన్ తీసుకుని ప్రజల్లో నమ్మకం కలిగించాలని అనుకున్నాం. కానీ, కోవిడ్ వారియర్స్కే ముందుగా వ్యాక్సిన్ వేయాలన్న ప్రధాని మోడీ సూచనతో మేం కూడీ ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోవడం లేదు“ అని ప్రకటించారు. వ్యాక్సిన్ వేయించుకోవడానికి మాకు ఛాన్స్ వచ్చే దాకా వేచి ఉంటామన్న ఆయన… హైదరాబాద్ వ్యాక్సిన్ హబ్గా మారిందంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా కేటీఆర్ వ్యవహరించారని కొందరు పేర్కొంటుంటే… మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్ను మరికొందరు రాజకీయ కోణంలో చూస్తుండటం కొసమెరుపు!