MAA Elections: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ప్రతి సారి ఇద్దరు మాత్రమే పోటీ పడే మా ఎన్నికల్లో ఈ సారి అయిదుగురు అభ్యర్థులు బరిలోకి సిద్ధపడుతుండటంతో మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ తరుణంలో ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఇండస్ట్రీలో రెండు మూడు వర్గాలుగా విడిపోయి రాజకీయాలు చేస్తుండటంతో సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సభ్యులు ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.
మా ఎన్నికలు వెంటనే జరిపించాల్సిన అవసరం ఉందంటూ మా క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు చిరంజీవి లేఖ రాశారు. ఎన్నికలు ఆలస్యం అయితే సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని లేఖలో పేర్కొన్నారు చిరు. కరోనా నేపథ్యంలో చాలా మంది సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, వారందరినీ ఆదుకోవాలంటే తక్షణమే మా కు కొత్త కార్యవర్గం ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సభ్యుల బహిరంగ ప్రకటనలతో మా ప్రతిష్ట మసకబారుతోందని చిరు ఆవేదన వ్యక్తం చేశారు. మా ప్రతిష్టను దెబ్బతీస్తున్న ఎవరినీ ఉపేక్షించవద్దని చిరు కోరారు.
చిరంజీవి సూచనలతో మా ఎన్నికలకు త్వరలో ముహూర్తం ఖరారు అవుతుందని భావిస్తున్నారు. ఇంతకు ముందు నందమూరి బాలకృష్ణ కూడా మా ఎన్నికలపై తన దైన శైలిలో స్పందించారు. బహిరంగ విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం మంచిది కాదనీ బాలకృష్ణ కూడా అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ రెండు మూడు వర్గాలుగా విడిపోయిన మా సభ్యులు ప్రత్యర్ధులపై విమర్శలు, ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తాజాగా చిరు స్పందన తరువాత అయినా బహిరంగ విమర్శలు, ఆరోపణలు ఆగుతాయని ఆశిద్దాం. కాగా మా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ, జీవితా రాజశేఖర్ పోటీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.