MAA Polls: ‘మా’ ఎలక్షన్ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమలో వాతావరణం వేడెక్కింది. ఈ సారి ఎన్నికల్లో అనూహ్యంగా ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ నలుగురు పోటీ చేయడానికి రెడి అవుతుండటంతో సభ్యులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో కొందరు నటీ నటుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు ఉన్నా వివిధ వేడుకల్లో కలిసి పాల్గొనడం చూస్తునే ఉన్నాం. సరదాగా గడుపుతూ ఉంటారు. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో ప్యానల్ లకు మద్దతు పలికే విషయంలో కొందరు బయటపడలేక పోతున్నారు.
కాగా నిన్న ప్రకాశ్ రాజ్ ప్యానల్ నిర్వహించిన మీడియా సమావేశంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలపై మా అధ్యక్షుడు నరేశ్ స్పందించారు. నాలుగేళ్లుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) మసకబారిందని నాగబాబు చేసిన వ్యాఖ్యలపై నరేశ్ మండిపడ్డారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నరేశ్ మాట్లాడుతూ సినీ పరిశ్రమకు ఎలాంటి సమస్య తలెత్తినా తాను, తన కుటుంబం సాయం చేస్తున్నామన్నారు. మా లోని సభ్యులను తాను కలుపుకుపోలేదని కొందరు చేస్తున్న విమర్శలు సరికాదన్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న వారు ఎవరైనా పోటీ చేయవచ్చనీ, ఇందులో లోకల్, నాన్ లోకల్ అనే సమస్య లేదన్నారు.
మా అనేది ఒక రాజకీయ వ్యవస్థ కాదనీ, అయితే నేడు రాజకీయ ఇష్యూలు తలెత్తుతున్నాయన్నారు. నాగబాబు తనకు మంచి మిత్రుడు, ఆయన అంటే తనకు గౌరవం ఉందని పేర్కొన్న నరేశ్ .. మా ప్రతిష్ఠ మసకబారిందని నాగబాబు అనడం మాత్రం సరికాదని పేర్కొన్నారు. మా కోసం తము చాలా కష్టపడ్డామన్నారు. ఆయన మాటలు బాధకల్గించాయన్నారు. సభ్యులకు భీమా సదుపాయం ఏర్పాటు చేయడం, 16 మంది చనిపోతే సుమారు రూ.50లక్షలు అందించడం, ఆర్టిస్టులకు పించన్ ల పెంపు లాంటి చర్యలతో పాటు కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని నరేశ్ ఈ సందర్భంగా వివరించారు.