MAA: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు నెలల క్రితం హోరాహోరీగా జరిగిన మా అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడుగా మంచు విష్ణు ప్రకాశ్ రాజ్ పై విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి 11 మంది విజయం సాధించగా, వాళ్లంతా సమావేశమై సంచలన నిర్ణయం తీసుకుని రాజీనామాలు చేశారు. ప్రకాష్ రాజ్ ప్యానల్లో ఎన్నికైన శ్రీకాంత్, ఉత్తేజ్తో పాటు మరో 11 మంది రాజీనామాలు చేశారు. వీరి రాజీనామాలు విష్ణు ఆమోదించారు. రాజీనామాలను ఉపసంహరించుకోవాలని తాము కోరామని, అయితే వారు తమ అభ్యర్థనను తిరస్కరించారని మంచు విష్ణు ఈ సందర్భంగా తెలిపారు.
MAA: మా భవనంపై వారం పది రోజుల్లో ప్రకటన
ఎట్టకేలకు వారి రాజీనామాలను ఆమోదించినట్లు ఆయన తెలిపారు. అక్టోబర్ 10న మా ఎన్నికలు జరిగాయి. రెండు నెలల తర్వాత తాము వారి రాజీనామాలను ఆమోదించామని విష్ణు తెలిపారు. మా ఎన్నికల తీరు, రాజకీయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రకాశ్ రాజ్, నాగబాబులు మా సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రకాశ్ రాజ్, నాగబాబు రాజీనామాలను మాత్రం ఆమోదించలేదని మంచు విష్ణు వెల్లడించారు. మరో వైపు మా అసోసియేషన్ భవనం నిర్మాణం విషయంపై చర్చలు జరుగుతున్నాయనీ, వారం పదిరోజుల్లో ఓ నిర్ణయం తీసుుకుని ప్రకటిస్తామని తెలిపారు మంచు విష్ణు.
ఎట్టకేలకు రాజీనామాలు ఆమోదం
మా అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు వెల్లడైన మరుసటి రోజే ప్రకాశ్ రాజ్ తన మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుండి గెలుపొందిన 11 మంది సభ్యులు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి, బెదిరించి, డబ్బుతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి గెలిచారంటూ విష్ణు పై వారు ఫైర్ అయ్యారు. అప్పట్లో ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు రాజీనామాలపై స్పందించిన విష్ణు వారి రాజీనామాలను స్వీకరించేది లేదని స్పష్టం చేశారు. అయితే రెండు నెలలు గడిచిన తరువాత కూడా వారు రాజీనామాలను ఉపసంహరించుకోకపోవడంతో రాజీనామాలు ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు.