YS Sharmila Party: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల ఇటీవల వైఎస్ఆర్ టీపీ పార్టీ స్థాపించి తెలంగాణలో యాక్టివ్ అయిన సంగతి తెలిసిందే. షర్మిల పార్టీ ఏర్పాటు ప్రకటన చేసిన నాటి నుండి షర్మిల పార్టీ వెనుక కేసిఆర్ ఉన్నారనీ కొందరు, బీజేపీ అంటూ మరి కొందరు ఇలా అనేక విమర్శలు రావడం, వాటిని ఆమె ఖండించడం కూడా జరిగింది. సీఎం కేసిఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తూ ముందుకు సాగుతున్న షర్మిల. ఇదిలా ఉండగా సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపి మధుయాష్కీ ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షర్మిల పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిన్న మున్న పుట్టిన పార్టీ వైఎస్ఆర్ టీపీ అని తీసిపారేశారు. ముందు షర్మిల గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అన్న మాటలు గుర్తు తెచ్చుకోవాలని సూచించారు మధు యాష్కీ. ఈ హోదా, పరపతి కాంగ్రెస్ పార్టీతోనే తనకు వచ్చాయనీ, రాహుల్ గాంధీని ప్రధాని గా చూడాలన్నదే తన ఆకాంక్ష అని వైఎస్ఆర్ గతంలో అన్న మాటలను గుర్తు మధుయాష్కీ గుర్తు చేస్తూ వైఎస్ఆర్ అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ ఉపయోగపడిందా లేక కాంగ్రెస్ పార్టీకే వైఎస్ఆర్ ఉపయోగపడ్డారా అనేది షర్మిల తెలుసుకోవాలన్నారు. ఉద్దేశం మంచిది అయితే ఫలితాలు కూడా మంచిగా ఉంటాయని కానీ వీళ్ల ఉద్దేశమే కాంగ్రెస్ పార్టీని వెనక దెబ్బతీయాలని, వెన్నుపోటు పొడచాలన్నది అని విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతున్నప్పుడు దొంగ దెబ్బతీస్తే అది బీజేపీ పార్టీకి లాభం చేకూరుస్తుందనీ, బీజేపీ పార్టీ మద్దతు ఉంటేనే ఆమె అన్న జగన్ గారు కేసుల నుండి బయటకు రాగలుగుతారనేది జగమెరిగిన సత్యమని అన్నారు. ఉద్దేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనీ బీజేపీకి లాభం చేకూర్చాలని పుట్టిన పార్టీగా మధుయాష్కీ వ్యాఖ్యానించారు. తెలంగాణలో షర్మిల పార్టీకి రాజకీయ భవిష్యత్తు సూన్యమని తన రాజకీయ అనుభవంతో చెబుతున్నానన్నారు.