Yadadri Temple: యాదాద్రి లక్ష్మీనర్శింహస్వామి వారి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసిఆర్ దంపతులతో పాటు మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, జగదీశ్ రెడ్డి, వువ్వాడ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తొలుత కేసిఆర్ దంపతులు బాలాలయం నుండి ప్రారంభమైన శోభాయాత్రలో పాల్గొన్నారు. ప్రధాన ఆలయం వరకూ వేద మంత్రోశ్చారణలు, మంగళవాయిద్యాలతో శోభాయాత్ర సాగింది. అనంతరం మహాకుంభ సంప్రోక్షణ ప్రారంభం అయ్యింది. గర్భాలయంలో సీఎం కేసిఆర్ దంపతులు తొలి పూజ నిర్వహించనున్నారు. తదుపరి యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములైన వారిని ఉత్తర రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద కేసిఆర్ సత్కరిస్తారు. ఆ తదుపరి యాగశాల స్థలం వద్ద అన్నప్రసాదంలో పాల్గొంటారు.
Yadadri Temple: దాదాపు ఆరు సంవత్సరాల తరువాత
దాదాపు ఆరు సంవత్సరాల తరువాత స్వయంభు స్వామి వారు గర్భాలయంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ నెల 21వ తేదీ ప్రధాన ఆలయ ఉద్ఘాటన క్రతువులకు శ్రీకారం చుట్టారు. అష్టభుజి ప్రాకార మండపాలు, సింహయాళీ, కాకతీయ స్తంభాలు, పురాణ ఇతిహాసాలను రాతి శిలలపై పదిలపరుస్తూ ఎన్నో విశేషాలతో పాంచనరసింహుల ఆలయ పునః నిర్మాణం, విస్తరణ పూర్తి అయ్యింది. సాధారణ భక్తులకు దర్శనానికి ఈ సాయంత్రం 4 గంటల నుండి అనుమతి ఇస్తారు. సాయంత్రం 6 గంటలకు శాంతి కల్యాణం, అచార్య రుత్విక్ సన్మానం, మహాదాశీర్వచనం కార్యక్రమాలు జరుగుతాయి. ఈ మహోత్సవాలను పురస్కరించుకుని పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.