తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై గత రాత్రి పోలీసులు దాడి చేసి హార్డ్ డిస్క్, లాప్ టాప్ లు సీజ్ చేసి పలువురుని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తొంది. దీనిపై టీ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ ఘాటుగా స్పందించారు.
ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టినందుకు తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడి చేశారనీ, 50 కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారని మాణిక్యం ఠాగూర్ విమర్శించారు. ప్రొసీజర్ లేకుండా తమ సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారని మండిపడ్డారు. అరెస్టు వారెంట్ ఇవ్వలేదనీ, 41 ఏ సీఆర్పీసీ నోటీసులు ఇవ్వకుండా పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించారన్నారు. ఇప్పుడు తాను అదే పోస్టు సోషల్ మీడియాలో పెడుతున్నానని, తనను అరెస్టు చేయాలంటూ కేసిఆర్ సర్కార్ కు మాణిక్యం ఠాగూర్ సవాల్ విసిరారు. ఈ పోస్టును హిట్లర్కేసిఆర్ హాష్ టాగ్ తో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. మరో పక్క కాంగ్రెస్ వార్ రూమ్ పై పోలీసుల దాడిని ఖండిస్తూ రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపును ఇవ్వగా, పోలీసులు కాంగ్రెస్ ముఖ్యనేతలను హౌస్ అరెస్టు చేశారు. సీపీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించాలని, రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ నేతలు చేపట్టిన నిరసనలను ముందుగానే అడ్డుకుంటున్నారు పోలీసులు, మాజీ మంత్రి షబ్బీర్ ఆలీ, మాజీ ఎంపీ మల్లు రవితో పాటు నేతలు రోహిన్ రెడ్డి, హరివర్థన్, రామ్ రెడ్డి మరి కొందరు ముఖ్య నేతలను హస్ అరెస్టు చేశారు. నేతల ఇళ్ల వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్యబద్దంగా ధర్నా చేసేందుకు ప్రయత్నిస్తున్నా తమను హౌస్ అరెస్టు చేయడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క పార్లమెంట్ లో మాణిక్యం ఠాగూర్ తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ ఘటనపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. ఇదే క్రమంలో ఈ ఘటనపై సునీల్ కనుగోలు టీమ్ న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది.