తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల ఆగ్రహం, అసహనం నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటి వరకూ టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జిగా ఉన్న మాణిక్యం ఠాగూర్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనను పార్టీ హై కమాండ్ గోవా ఇన్ చార్జిగా నియమించింది. మాణిక్యం ఠాగూర్ స్థానంలో మహారాష్ట్రకు చెందిన మాజీ మంత్రి మాణిక్ రావు థాకరే నియమితులైయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. మాణిక్ రావు థాకరే గతంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహించారు. బీజేపీ, శివసేన ప్రభుత్వాలను తీవ్రంగా విమర్శించిన నేతగా గుర్తింపు ఉంది.
ఇటీవల కాలంలో టీ కాంగ్రెస్ లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఈ కీలక నిర్ణయాలను తీసుకుంది. పలువురు సీనియర్ తెలంగాణ నేతలు మాణిక్యం ఠాగూర్ పై తీవ్ర స్థాయి విమర్శలు చేశారు. పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ఇన్ చార్జి పదవికి రాజీనామా చేసిన మాణిక్యం ఠాగూర్. టీ కాంగ్రెస్ వాట్సాప్ గ్రూపు నుండి లెఫ్ట్ అయ్యారు. గ్రూపు నుండి లెఫ్ట్ అయ్యే ముందు .. ఈ రోజు వరకూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు అంటూ మెసేజ్ పెట్టారు మాణిక్యం ఠాగూర్.
ఈ తాజా పరిణామాల నేపథ్యంలో టీ కాంగ్రెస్ వాట్సాప్ గ్రూప్ లో గందరగోళం నెలకొంది. టీ కాంగ్రెస్ ఇన్ చార్జి పదవి నుండి మాణిక్యం ఠాగూర్ తప్పుకున్నారంటూ ప్రచారం జరగ్గా, అటువంటిది ఏమీ లేదు వాట్సాప్ గ్రూపులోనే ఉన్నారంటూ కొందరు కాంగ్రెస్ నేతలు వాదించారు. ఆ ప్రచారాన్ని నమ్మలేదు. సాంకేతిక సమస్యల వల్లనే ఎగ్జిట్ అయ్యారంటూ మరి కొందరు పేర్కొన్నారు. చివరకు గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజమైంది. ఈ పరిణామాల క్రమంలో టీ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విషయంలో పార్టీ అధిష్టానం ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను తప్పుకుంటేనే పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటే తాను పదవి నుండి తప్పుకోవడానికైనా సిద్దమని పేర్కొన్నారు. పార్టీ కోసం ఏ త్యాగానికైనా సిద్దమని తెలిపారు. ఏ బాధ్యతలు ఇచ్చినా పార్టీ కోసం పని చేస్తానని అన్నారు రేవంత్ రెడ్డి.