Medak car fire accident case: .వారెవ్వ.. అతను ఏడు కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఏమీ స్కెచ్ వేశాడు. డబ్బులు సంపాదించేందుకు కొందరు కష్టపడతారు.వ్యాపారాలు చేస్తారు. మరి కొందరు నేరాలకు, మోసాలకు పాల్పడుతుంటారు. ఓ ఉద్యోగి మాత్రం చేసిన అప్పులు తీర్చడం కోసం ఇన్సూరెన్స్ సంస్థ ను మోసం చేసి ఏడు కోట్లు పొందాలని చావు తెలివి తేటలు ఉపయోగించాడు. కానీ ప్లాన్ బెడిసి కొట్టింది. హత్య కేసులో కటకటాల పాలు అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.
విషయంలోకి వెళితే.. మెదక్ జిల్లా టెక్మల్ సమీపంలో ఈ నెల 9వ తేదీన కారు దగ్ధం అయ్యింది. కారులో ఓ గుర్తు తెలియని వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. పోలీసు దర్యాప్తులో తొలుత ఈ కారులో సచివాలయ ఏఎస్ఓగా పని చేసే ధర్మానాయక్ చనిపోయాడని భావించారు. ప్రమాదం కారణంగా కారు దగ్ధమై అతను చనిపోయాడని అందరూ భావించారు. అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో దగ్దమైన కారు సమీపంలో ఓ పెట్రోల్ బాటిల్ కనబడటంతో ఇది ప్రమాదం కాదన్న భావనకు వచ్చారు. మృతి చెందినట్లుగా భావిస్తున్న ధర్మానాయక్ .. పూణెలో ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సచివాలయంలో ఏఎస్ఓ గా పని చేసే ధర్మానాయక్ చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. ఆన్ లైన్ గేమింగ్స్, బెట్టింగ్ లతో భారీ గా నష్టపోయాడు. దాదాపు రూ.2కోట్లు అప్పులు చేశాడు, ఈ అప్పులు తీర్చే మార్గం కనబడకపోవడంతో తాను చనిపోయినట్లుగా సృష్టించి రూ.7 కోట్ల ఇన్సూరెన్స్ పొందాలని భారీ స్కెచ్ వేశాడు. ఆ క్రమంలో కొద్ది రోజుల క్రితం తన డ్రైవర్ తో కలిసి కారులో బయలుదేరి వెళ్లి మెదక్ జిల్లా టెక్మల్ వద్ద కారును ఆపి, కారులో డ్రైవర్ ఉండగానే బయట నుండి పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. అతను అనుకున్నట్లుగా కారు ధగ్ధం అయ్యింది. కారులోని డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. అనంతరం ధర్మానాయక్ అక్కడి నుండి పూణెకు పరారై అక్కడ నుండి ఇన్సూరెన్స్ క్లైమ్ చేసే ప్రయత్నం చేశాడు.
అయితే పోలీసులు తమ దైన శైలిలో దర్యాప్తు జరపగా ధర్మానాయక్ చావు తెలివి తేటలు వెల్లడైయ్యాయి. డ్రైవర్ హత్య కేసులో నిందిడుగా మారి కటకటాల పాలు కావాల్సిన పరిస్థితి ధర్మానయక్ కు ఏర్పడింది. ధర్మానాయక్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్న మెదక్ జిల్లా పోలీసులు ఈ కేసుకు సంబందించి పూర్తి వివరాలను ఈ రోజు సాయంత్రానికి అధికారికంగా వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.