Medaram Jatara 2022: దక్షిణాది కుంభమేళా మేడారం జాతరలో రెండవ రోజైన గురువారం మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. 20 ఏళ్లలో తొలి సారిగా మాఘసుద్ధ పౌర్ణమి నాడు మహా జాతర ప్రారంభం కావడంతో భక్తులు జాతరకు పోటెత్తారు. మేడారం పరిసర ప్రాంతాలు భక్తజన సంద్రంగా మారాయి. జాతర తొలి రోజు బుధవారం పగిడిద్దరాజు, గోవిందరాజు సమేతంగా సారలమ్మ గద్దెలపై కొలువు తీరగా రెండవ రోజు గురువారం సమ్మక్క డప్పు వాయిద్యాలు, జయజయ ధ్వానాలు, శివసత్తుల పూనకాల నడుమ ఊరేగింపుగా చిలకలగుట్ట నుండి మేడారానికి వచ్చి గద్దెపై కొలువుదీరింది.
Medaram Jatara 2022: గాలిలో మూడు రౌండ్లు కాల్పులు జరిపి
సమక్కకు స్వాగతం పలుకుతూ గౌరవ సూచకంగా ములుగు ఎస్పీ గాలిలో మూడు రౌండ్లు కాల్పులు జరిపి అమ్మవారికి గౌరవ వందనం సమర్పించారు. సమ్మక్కకు వేల సంఖ్యలో భక్తులు స్వాగతం పలికారు. సమ్మక్క వచ్చే మార్గంలో భక్తులు పొర్లు పొర్లు దండాలు పెట్టారు. సమ్మక్క తల్లి గద్దెల వద్దకు చేరుకోవడంతో కొద్దిసేపు దర్శనాలను నిలుపుదల చేసి పూజారులు సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. అనంతరం దర్శనాలు యధావిధిగా కొనసాగించారు.
Medaram Jatara 2022: కోలాహలంగా పరిసరాలు
రేపు ఎల్లుండి భక్తుల దర్శనార్ధం వనదేవతలు గద్దెలపైనే ఉంటారు. వేలాది మంది భక్తులు నిలువెత్తు బంగారంతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారం పరిసర ప్రాంతాల్లో ఎటు చూసినా గుడారాలు వెలిశాయి. ఇసుకవేస్తే రాలనంత జనంతో పరిసరాలు కోలాహలంగా మారాయి. జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో బందోబస్తు చర్యలు చేపట్టారు. శుక్రవారం సాయంత్రం సిఎం కేసిఆర్ మేడారం జాతరలో పాల్గొని వనదేవతలను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకోనున్నారు.
Read More: YS Jagan: సినీ నటుడు ఆలీకి నామినేటెడ్ పోస్టు ఖాయం చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్..!ఇదిగో ప్రూఫ్..!!