హైదరాబాద్ మెట్రో టికెట్ ధరలు ఇష్టం వచ్చినట్లుగా పెంచితే ఊరుకోమని, ఇప్పటికే వారికి ఈ విషయంపై వారిని హెచ్చరించినట్లు మంత్రి కేటిఆర్ తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ 2023 -24 సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవేళ శాసనసభలో పలు బిల్లులకు ఆమోదం లభించింది. వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లు, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. గురుకుల కళాశాలల్లో వ్యవసాయ కోర్సులు ప్రవేశపెడితే ఆ కళాశాలకు వ్యవసాయ విశ్వ విద్యాలయం అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని, అందుకే తాజా సవరణ చేపట్టినట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
అనంతరం పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. బద్రాచలాన్ని మూడు గ్రామాలు చేస్తూ సవరణ ప్రవేశపెట్టారు. నిబందనల ప్రకారం బద్రాచలాన్ని పురపాలక సంఘంగా మార్చే అవకాశం లేదనీ, ఇదే సమయంలో లక్ష వరకూ జనాభా ఉంది కాబట్టి ఒకే పంచాయతీగా ఉండే అవకాశాం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. బద్రాచలం గ్రామ పంచాయతీకి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిందని తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసం బద్రాచలాన్ని మూడు గ్రామ పంచయతీలుగా చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు.
ఇవేళ తొలుత సభ ప్రారంభమైన తర్వాత రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ .. హైదరాబాద్ నాలాల అభివృద్ధి, మెట్రో గురించి శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. నగరంలో మెట్రో రైల్ కొత్త పనులకు కేంద్రం మోకాలడ్డుతోందని మంత్రి కేటిఆర్ విమర్శించారు. దేశంలో చిన్న చిన్న నగరాలకు కూడా మెట్రో రైళ్ల అభివృద్ధికి కోట్ల కేంద్రం నిధులు విడుదల చేస్తూ .. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరానికి మాత్రం మొండి చేయి చోపుతోందని మంత్రి కేటిఆర్ ధ్వజమెత్తారు. మెట్రో ధరలు ఆర్టీసితో సమానంగా ఉండాలని మెట్రో అధికారులకు సూచించామని తెలిపారు మంత్రి కేటిఆర్.
మత్స్య శాఖ పై ప్రశ్నకు రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమాధాన మిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే చేపల ఉత్పత్తి రాష్ట్రంలో పెరిగిందన్నారు. 2021 – 22 లో 4.4 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యం కాగా, 3.89 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. 2022 -23 లో 4.67 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దారించినట్లు ఆయన పేర్కొన్నారు. చేపలు పట్టేందుకు మత్స్యకార కులస్తులకే హక్కు కల్పిస్తున్నామని మంత్రి వెల్లడించారు. చెరువుల్ల చేపలు పట్టడానికి ఇతర వర్గాలకు హక్కు లేదని మంత్రి స్పష్టం చేశారు.