MLA Jaggareddy: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) పార్టీకి మరో సారి షాక్ ఇవ్వనున్నారు. గత కొంత కాలంగా పార్టీతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్న జగ్గారెడ్డి నేడు పార్టీకి రాజీనామా చేయనున్నారు. త్వరలో ఆయన అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరతారు అన్న ప్రచారం జరుగుతోంది. అయితే తాను ఏ పార్టీలోనూ చేరబోననీ, స్వతంత్రంగానే ఉంటానని పేర్కొంటున్నారు. పార్టీ కోసం ఎంతో కష్టపడినా తనను అవమానించేలా, తన వ్యక్తిత్వం దెబ్బతీసేలా పార్టీలోని కొందరు కుట్రలు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అవమానాలను తట్టుకోలేక పార్టీ వీడాలని జగ్గారెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తన రాజీనామా లేఖను అధిష్టానానికి నేడు పంపనున్నట్లు సమాచారం. పార్టీని వీడడానికి గల కారణాలను వివరిస్తూ పార్టీ అధినేత్రి సోనియో గాంధీకి లేఖ రాయాలని జగ్గారెడ్డి భావిస్తున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లా నుండి కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే
దాదాపు నాలుగు దశాబ్దాలుగా జగ్గారెడ్డి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. 2018 ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లా నుండి కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే జగ్గారెడ్డి. పీసీసీ అధ్యక్ష పదవిని రేవంత్ రెడ్డికి ఇవ్వడాన్ని తొలి నుండి జగ్గారెడ్డి వ్యతిరేకిస్తూ పలు మార్లు బాహాటంగానే తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఇటీవల కాలం వరకూ కేసిఆర్, కేటిఆర్ లపై తీవ్రంగా విమర్శిస్తూ వచ్చిన జగ్గారెడ్డి ఇటీవల నుండి తన దూకుడు తగ్గించడంతో పాటు ఓ సందర్భంలో కేసిఆర్ ను సైతం పొగడ్తలతో ముంచెత్తడంతో ఆయన తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరడం ఖాయమని సంకేతాలు వచ్చాయి. అయితే తాను ఏ పార్టీలో చేరడం లేదని జగ్గారెడ్డి చెప్పడం విశేషం.
MLA Jaggareddy: నాలుగు దశాబ్దాలు ..మూడు పార్టీలు
వాస్తవానికి జగ్గారెడ్డి మొదటి నుండి ఒకే పార్టీలో ఉన్న నాయకుడు ఏమీ కాదు. నాలుగు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో బీజేపీ నుండి టీఆర్ఎస్ కు, టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కి, మళ్లీ తిరిగి బీజేపీకి, ఆ తరువాత మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1986లో బీజేపీ నుండి సంగారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన జగ్గారెడ్డి 1995లో మున్సిపల్ చైర్మన్ అయ్యారు. ఆ తరువాత టీఆర్ఎస్ పార్టీలో చేరి 2004 లో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరల 2009లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 2012 నుండి 2014 వరకూ ప్రభుత్వ విప్ గా పని చేశారు. 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత బీజేపీలో చేరి మెదక్ లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి ఓటమిపాలైయ్యారు. 2015లో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. జగ్గారెడ్డి తన రాజకీయ జీవితంలో బీజేపీని వీడి మళ్లీ బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీని వీడి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ ను వీడిన తరువాత మళ్లీ టీఆర్ఎస్ లో చేరలేదు. సో.. మళ్లీ టీఆర్ఎస్ లో చేరతారా లేక బీజేపీ వైపు చూస్తారా అనేది వేచి చూడాలి.