MLAs poaching case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడు రామచంద్ర భారతికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తన రిమాండ్ ను సవాల్ చేస్తూ రామచంద్రభారతి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఈ కేసులో జోక్యం చేసుకునేందుకు సుప్రీం ధర్మాసనం విముఖత చూపింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్పులకు అనుగుణంగా నిందితుడు బెయిల్ మంజూరు కొరకు హైకోర్టును ఆశ్రయించే హక్కు ఉందని సుప్రీం కోర్టు తెలిపింది. తమ పై మొయినాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలు దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విక్రమనాథ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. వారి అభ్యర్ధనను తిరస్కరించింది.
మొయినాబాద్ ఫామ్ హౌస్ నందు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి బేరసారాలు జరుపుతున్న సందర్భంలో రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీలను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం తెలంగాణలోనే కాక దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ కేసు దర్యాప్తునకు తెలంగాణ సర్కార్ హైదరాాబాద్ సీపీ ఆనంద్ నేతృత్వంలో ప్రత్యేక విచారణ బృందం (సిట్)ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సిట్ ఆధ్వర్యంలో విచారణ వేగవంతంగా జరుగుతోంది. ఈ కేసులో పలువురు బీజేపీ కీలక నేతలకు సిట్ విచారణకు హజరుకావాలంటూ నోటీసులు కూడా జారీ చేసింది.