mobile she toilets: కొంత మంది ప్రజల అవసరాల కోసం చేసే కార్యక్రమాలు ఆదర్శప్రాయంగా, స్పూర్తిదాయకంగా నిలుస్తుంటాయి. కొన్ని కార్యక్రమాలు యావత్ దేశాన్ని ఆకర్షిస్తుంటాయి. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళా ఎన్ఆర్ఐ వినూత్న ఆలోచనా విధానంతో చేపట్టిన కార్యక్రమం ప్రశంసలను అందుకుంటోంది. హైదరాబాద్ కు చెందిన సుష్మ కల్లెంపూడి అనే మహిళ 2017లో అమెరికా నుండి స్వదేశానికి తిరిగి వచ్చింది. ఆమె హైదరాబాద్ లో పర్యటిస్తున్న సమయంలో వివిధ ప్రాంతాల నుండి పనుల నిమిత్తం మహానగరానికి విచ్చేసిన మహిళలు అత్యవసర పరిస్థితుల్లో కాలకృత్యాలు తీర్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించారు.
మహిళల ఇబ్బందుల పరిష్కారానికి ప్రభుత్వం, జీహెచ్ఎంసీ షీ టాయిలెట్లు ఏర్పాటు చేసినా వాటి నిర్వహణ సక్రమంగా లేకపోవడం వాటిని వినియోగించుకోలేకపోతున్నారు. ఈ ఇబ్బందులను గమనించిన సుష్మ సమస్య పరిష్కారానికి ఓ చిరు ప్రయత్నం చేశారు. పాత ఆటోలను సేకరించి మోబైల్ షీ టాయ్ లెట్ లుగా రూపొందించారు. ఆటోలో క్లీన్ టాయి లెట్ ఏర్పాటు చేసి హైదరాబాద్ నగర వీధుల్లో తిప్పుతున్నారు. ఈ ఆటోలను జీహెచ్ఎంసీ, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చూపించారు. మొబైల్ షీ టాయ్ లెట్ వల్ల రద్దీ ప్రాంతాల్లో మహిళలకు ఎంతో ఉపయోగంగా ఉంటున్నాయనీ, పర్యావరణ హితంగా పని చేస్తాయని గుర్తించిన ప్రభుత్వం ఇలాంటి ఆటోలను మరిన్ని ఏర్పాటుకు చేయడానికి ప్రోత్సహిస్తున్నారు, ప్రస్తుతం హైదరాబాద్లో 25 మొబైల్ షీ టాయిలెట్ లు తిరుగుతున్నాయి.
ఈ మొబైల్ షీ టాయిలెట్ ల గురించి సుష్మ వివరిస్తూ ఒక్కో ఆటో తయారీకి రూ.4లక్షలు ఖర్చు వుతోందని తెలిపారు. స్వచ్చభారత్ లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత ప్రోత్సాహం అందిస్తే వందలాది వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ మొబైల్ షీ ఆటోలలో ప్రత్యేకతలు ఏమిటంటే.. వంద లీటర్ల కెపాసిటీ వాటర్ ట్యాంకు, అద్దం, హ్యాంగర్, వాష్ బేసిన్, ఫ్లెష్, డ్రైనేజీ సిస్టమ్ ఉన్నాయి. అంతే కాకుండా చంటి పిల్లలకు డైపర్స్ మార్చుకునేందుకు అనువుగా స్థలం ఉంది. మహిళలకు అత్యవసరంగా కావాల్సి వస్తే శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా అందిస్తారు. సెల్ ఫోన్ చార్జింగ్ పాయింట్ ఉన్నాయి. ప్రతి ఆటోకు జీపిఎస్ కనెక్టెవిటీ ఉంది. సుష్మ ఆలోచనను పలువురు ప్రశంసిస్తున్నారు.