Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతుండటంతో నియోజకవర్గంలో పోటాపోటీగా ప్రలోభాల పర్వానికి తెరలేపినట్లు తెలుస్తొంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండటంతో అభ్యర్ధులు, వారి మద్దతుదారులు ఓటర్లకు జోరుగా నగదు పంపిణీ చేస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఈ నెల 3వ తేదీ (రేపు) గురువారం ఉదయం నుండి పోలింగ్ ప్రారంభం అవుతుండగా, కొందరు తమకు డబ్బులు అందలేదంటూ పలు చోట్ల ఆందోళన చేస్తున్నారు. పది వేల నగదు, తులం బంగారం కాయన్ ఇస్తామని చెప్పి తక్కువగా ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ పార్టీ ఓటర్లకు బంగారు కాయన్స్ పంపిణీ చేస్తుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో నిజమని నమ్మి ఆ పార్టీ నేతలను ప్రశ్నిస్తున్నారు. అయితే ఇదంతా తప్పుడు ప్రచారమని అంటున్నారు.
అయితే ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా ఉండటంతో పెద్ద మొత్తంలోనే పంపిణీ జరుగుతుందని, ఓటుకు పదివేలకుపైగా గిట్టుబాటు అవుతుందని పేదవర్గాలు, మహిళలు ఆశించారు. అయితే ఆయా పార్టీలు ఓటర్లు ఊహించిన దాని కంటే తక్కువగా పంపిణీ చేస్తుండటం, అది కూడా కొందరికి అందకపోవడంతో ముందు చెప్పిన విధంగానే పంచాలంటూ మహిళా ఓటర్లు రొడ్కెక్కారు. మరో పక్క ఇతర ప్రాంతాలకు చెందిన వారు నియోజకవర్గంలో ఉండటానికి వీల్లేదని ఈసీ ఆదేశాలు జారీ చేసినా పలు మండలాల్లో రహస్యంగా ఇతర ప్రాంతాల వారు తిష్టవేసి పంపిణీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారని అంటున్నారు.
ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూనే ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నగదు, మద్యం పంపిణీని అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ టీమ్ లు విస్తృతంగా తనిఖీలు చేస్తొంది. పెద్ద ఎత్తున ఎక్కడ నగదు ఉన్నట్లు సమాచారం అందుతున్నా వెంటనే దాడులు చేస్తూ హవాలా నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. కేసులు నమోదు చేస్తున్నారు.