Motkupalli Narsimhulu: సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్శింహులు అధికార టీఆర్ఎస్ లో చేరికకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఇటీవలే మోత్కుపల్లి బీజేపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. దళిత బంధు పథకంపై ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యమంత్రి కేసిఆర్ స్వయంగా మోత్కుపల్లికి అహ్వానించడంతో బీజేపీ నాయకత్వానికి సమాచారం ఇవ్వకుండా మోత్కుపల్లి ఆ సమావేశానికి హజరు అయ్యారు. ఆ సందర్భంలో కేసిఆర్ ను అపర బీఆర్ అంబేద్కర్ అంటూ కీర్తించారు. దళితుల అభ్యున్నతికి ఇటుువంటి పథకాన్ని గతంలో ఎన్నడూ తీసుకురాలేదని సీఎం కేసిఆర్ ను ప్రశంసించారు. దీంతో ఆనాడే మోత్కుపల్లి టీఆర్ఎస్ కు ఆకర్షితులైయ్యారని విమర్శలు వచ్చాయి. దళిత వ్యతిరేక పార్టీ అని బీజేపీకి ఉన్న పేరును తొలగించడానికే తాను ఈ సమావేశానికి వెళ్లానంటూ దీనిలో ఎటువంటి దురుద్దేశం లేదని చెప్పుకొచ్చిన కొద్ది రోజులకే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. బీజేపీకి గుడ్ బై చెప్పారు.
Motkupalli Narsimhulu: రేపు టిఆర్ఎస్ కండువా కప్పుకోనున్న మోత్కుపల్లి
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ లో చేరేందుకు మోత్కుపల్లి రంగం సిద్ధం చేసుకున్నారు. అక్టోబర్ 18 (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మోత్కుపల్లి టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోనున్నారు. కేసిఆర్ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకోనున్నారు. మోత్కుపల్లి నర్శింహులు రాష్ట్ర విభజనకు ముందు వరకూ టీడీపీలో కీలక నేతగా కొనసాగిన విషయం తెలిసిందే. యాదాద్రి – భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గానికి చెందిన మోత్కుపల్లి నర్శింహులు 1983లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం టీడీపీలో చేరి వరుసగా అయిదు సార్లు ఎమ్మెల్యే గా విజయం సాధించారు. టీడీపీలో మంత్రిగా మంత్రిగానూ పని చేశారు. తెలంగాణ ఏర్పాటుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసన వ్యక్తం చేయడంతో 2018 మే 28న టీడీపీ మోత్కుపల్లిని పార్టీ నుండి బహిష్కరించింది. 2018లో తెలంగాణకు జరిగిన ముందస్తు ఎన్నికల్లో బహుజన ఫ్రంట్ పార్టీ తరపున ఆలేరు నియోజకవర్గం నుండి పోటీ చేసి పరాజయం పాలైయ్యారు. 2019 నవంబర్ 4 మోత్కుపల్లి బీజేపీలో చేరారు. ఈ ఏడాది జూలై 23న బీజేపీకి రాజీనామా చేశారు. సుదీర్ఘకాలం టీడీపీలో క్రియాశీలకంగా పని చేసిన మోత్కుపల్లికి ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించాలన్న ఆకాంక్ష ఉందని అందుకే బీజేపీలో చేరారని నాడు వార్తలు వచ్చాయి. అయితే బీజేపీలో ఆయనకు పెద్దగా ప్రెయారిటీ ఇచ్చిన దాఖలాలు లేవు. దీంతో ఆయన ఆ పార్టీలో ఇమడలేకపోయారు.
మోత్కుపల్లికి కీలక పదవి రిజర్వుడ్..
కాగా రాష్ట్రంలో ప్రస్తుతం దళిత అంశం తెరపైకి రావడంతో కేసిఆర్ మోత్కుపల్లికి కీలక పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు ఉహాగానాలు వినబడుతున్నాయి. ఈ సమయంలో మోత్కుపల్లి టీఆర్ఎస్ లో చేరితే కేసిఆర్ కీలక పదవి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. ఇటీవల ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దళిత బంధు పథకానికి సంబంధించి కేబినెట్ ర్యాంక్ లో చైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. దళిత బంధుపై నిర్వహించిన సమావేశంలోనూ కేసిఆర్ మోత్కుపల్లికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. సమావేశంలో కేసిఆర్ మోత్కుపల్లికి తన పక్క సీటు ఏర్పాటు చేశారు. దీన్ని బట్టే కేసిఆర్ మోత్కుపల్లికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్లు అందరూ అనుకున్నారు. మరో విషయం ఏమిటంటే పూర్వాశ్రమం టీడీపీలో కేసిఆర్, మోత్కుపల్లిలు సహచరులు, మిత్రులు కావడం గమనార్హం.