Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఇంటింటికి అభ్యర్ధులు, నేతలు వెళుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకరరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి, బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు ఆాయ పార్టీల నేతలతో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తన తండ్రి దివంగత నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ స్రవంతి ఓట్లు అభ్యర్ధిస్తున్నారు. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునే ప్రయత్నంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యనేతలతో సమావేశాలను నిర్వహిస్తూ కోఆర్డినేషన్ చేస్తున్నారు.
అధికార టీఆర్ఎస్ అభ్యర్ధి ప్రభాకరరెడ్డి గతంలో ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధి, టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్ధిస్తున్నారు. ప్రభాకరరెడ్డికి మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్న వామపక్షాల నేతలు ఆయన ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు. బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి వివరిస్తూ సమస్యల పరిష్కారానికి హామీలు ఇస్తూ ప్రచారాన్ని చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి మద్దతుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందనరావు తదితర నేతలు ప్రచారం చేస్తున్నారు. ప్రచార పర్వంలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కీలక నేతలు మాటల తూటాలు పేలుతున్నాయి. రోడ్డు షోలు, ర్యాలీలతో హోరెత్తిస్తూ ప్రత్యర్ధులపై విమర్శలు సంధిస్తున్నారు. ముఖ్య నేతల పర్యటనలు, రోడ్ షోలు, బహిరంగ సభలకు ఏర్పాటుకు ప్రధాన రాజకీయ పక్షాలు సిద్దమవుతున్నాయి.
మరో పక్క ఈ రోజు పది మంది స్వతంత్ర అభ్యర్ధులు నామినేషన్ల ను ఉపసంహరించుకున్నారు. దీంతో పోటీలో ఉన్న అభ్యర్ధుల సంఖ్య 73కి చేరింది. నామినేషన్ల ఉపసంహరణకు రేపు మద్యాహ్నం మూడు గంటల వరకూ గడువు ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీల నేతలు మరి కొందరి నామినేషన్ల ఉపసంహరణకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తొంది. రేపు సాయంత్రం పోటీలో ఉన్న తుది జాబితాను అధికారులు ప్రకటించనున్నారు. నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరగనుంది. నవంబర్ 6వ తేదీన ఓట్ల లెక్కింపు జరిపి అదే రోజు ఫలితాన్ని వెల్లడించనున్నారు.