Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలను ప్రధాన రాజకీయ పక్షాలు అన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్ నుండి కుసుకుంట్ల ప్రభాకరరెడ్డి, బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి రెడ్డి పాటు మరో 40 మందికిపైగా అభ్యర్ధులు పోటీలో ఉన్నా ప్రధానంగా పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే అన్నది అందరికీ తెలిసిందే. ఇటు అభ్యర్ధులతో పాటు ఆయా పార్టీల నేతలు విసృతంగా ఎన్నికల ప్రచారాలను నిర్వహిస్తున్నారు. ఇంటింటి ప్రచారం, రోడ్డు రో, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మందు, మనీ పంపిణీ పంపిణీ చేస్తున్నారన్న వార్తలు వినబడుతున్నాయి. ఉప ఎన్నికల నేపథ్యంలో మద్యం, మనీ రవాణా కార్యక్రమాలను నిరోధించేందుకు మునుగోడు నియోజకవర్గానికి వచ్చే ప్రధాన రహదారుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి విస్తృతంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఇప్పటి వరకూ కోటిన్నర వరకూ (రూ.1,48,44,160) నగదును సీజ్ చేశారు. అదే విధంగా దాదాపు లక్ష రూపాయల విలువైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని సోమవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి రోహిత్ సింగ్ వెల్లడించారు. ఉప ఎన్నికల ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ నగదు పంపిణీ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని తెలిపారు. డబ్బులు తరలించకుండా ఎక్కడికక్కడ పోలీసులతో తనిఖీలు జరిపిస్తున్నామని వివరించారు. ఉప ఎన్నికల నిర్వహణలో ఈసీ నియమ నిబంధనలు అన్నింటినీ పాటిస్తామని తెలిపారు.
ఈవీఎం మిషన్ల మిషన్లతో రీసెంట్ గా నిర్వహించిన మాక్ పోలింగ్ సాఫీగా జరిగిందని ఆర్ఓ తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు, పోలింగ్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్ఒ రోహిత్ సింగ్ చెప్పారు. మునుగోడు నియోజకవర్గంలో 2,41,805 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఓటరు లిస్ట్ లో పేర్లు గల్లంతైన వారు రోజు తమ కార్యాలయానికి వస్తున్నారనీ, వాళ్ల నుండి వివరాలు సేకరించి పరిశీలిస్తున్నామని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ నవంబర్ 3వ తేదీ జరగనుంది. 6వ తేదీ ఓట్ల లెక్కింపు నిర్వహించి పలితాన్ని వెల్లడించనున్నారు.