Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల్లో గుర్తులకు సంబంధించిన వివాదం నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి (ఆర్ఒ)పై వేటుపడింది. నిబంధనల ప్రకారం ఎన్నికల్లో ఒక సారి అభ్యర్ధులకు ఎన్నికల గుర్తులు కేటాయించిన తర్వాత వాటిని మార్చరు. ఒక వేళ మార్చాల్సిన అవసరం ఏర్పడితే కేంద్ర ఎన్నికల సంఘానికి సదరు అంశాన్ని తెలియజేసి వారి అనుమతితో రిటర్నింగ్ అధికారి ఎన్నికల గుర్తు మార్పుపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో అధికారి టీఆర్ఎస్ ఆందోళన చేసిన నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి .. యుగ తులసి పార్టీకి కేటాయించిన రోడ్డు రోలర్ గుర్తును మార్పు చేసి దాని స్థానంలో బేబీ వాకర్ గుర్తును కేటాయించారు. దీంతో డ్రాలో రోడ్ రోలర్ గుర్తు పొందిన యుగ తులసి పార్టీ అభ్యర్ధి శివకుమార్ ఈసీకి ఫిర్యాదు చేశారు.
యుగ తులసి పార్టీ అభ్యర్ధి శివకుమార్ ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. అసలు గుర్తు ఎందుకు మార్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేసి వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది, శివకుమార్ కు ఇది వరకు కేటాయించిన రోడ్డు రోలర్ గుర్తును పునరుద్దరించింది. అంతే కాకుండా ఆర్ ఓ నుండి వివరణ రాకముందే ఆయనపై వేటు వేసింది. ఆర్ ఓ ను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి రిటర్నింగ్ అధికారి నియామకం కొరకు ముగ్గురు అధికారులతో కూడిన నివేదిక పంపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఇఓ)ను ఈ సీ ఆదేశించింది.
మరో పక్క ఆర్ఒ పై వేటు వేయడం పట్ల టీఆర్ఎస్ నేత, మంత్రి కేటిఆర్ ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని కేేటిఆర్ ఖండించారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరించాలని ఆయన సూచించారు. రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నదని విమర్శించారు కేటిఆర్. ఎలక్షన్ కమిషన్ పై బీజేపీ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తొందని అన్నారు. 2011 లోనే సస్పెండ్ చేసిన రోడ్డు రోలర్ గుర్తును తిరిగి కేటాయించడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దమని ఆయన అన్నారు. మునుగోడులో బీజేపీ దొడ్డిదారిన గెలవాలని చూస్తొందని కేటిఆర్ మండిపడ్డారు. అయితే రోడ్ రోలర్ గుర్తును ఈసీ 2011 లో సస్పెండ్ చేసినా 2017లో సమీక్ష జరిపిన అనంతరం ఆ గుర్తును జాబితాలో చేర్చారు. అప్పటి నుండి ఉప ఎన్నికల్లో ఆ గుర్తు అభ్యర్ధులకు కేటాయిస్తున్నారు.